పెగడపల్లి, సెప్టెంబర్ 20: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం ల్యాగలమర్రి, దేవికొండ, నంచర్ల గ్రామాల్లో బుధవారం ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సుమారు రూ.5 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మండల పరిషత్ కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో సీఎం కేసీఆర్ 90 శాతం మేర అభివృద్ధి పనులు చేపట్టారని, దేశంలో ఇలా ఎక్కడా జరుగలేదని స్పష్టం చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలను గాలికి వదిలి వేశారని గుర్తు చేశారు.
మళ్లీ అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెబుతున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న ముష్టి కాంగ్రెస్ను నమ్ముకుంటారా?, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను ఇచ్చే బీఆర్ఎస్ను నమ్ముతారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రైతులు అంటే ఏమాత్రం పట్టింపు లేదని, వడ్లు కొనం అని, రైతులకు ఉచిత పథకాలు దండుగ అని అమిత్షా ప్రకటనలు చేయడం అమానుషమని ధ్వజమెత్తారు.
అలాంటి పార్టీకి నమ్మొద్దని సూచించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిపోయిందని, దేశంలో వరి పండించే రాష్ర్టాల్లో తెలంగాణ ముందంజలో ఉందని వివరించారు. ఈ సందర్భంగా నంచర్లకు చెందిన బీజేపీ జిల్లా నాయకుడు హరిగోపాల్ తన అనుచరులతో కలిసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు
పెగపడపల్లి మండలంలోని మద్దులపల్లి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు రూ.కోటితో, మద్దులపల్లి నుంచి పెగడపల్లి కస్తూర్భా పాఠశాల వరకు రూ.2 కోట్లతో చేపట్టే రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామ మహిళ, కురుమ సంఘ భవనాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తూ, ప్రొసీడింగ్ కాపీలను మంత్రి అందజేశారు. దేవికొండలో రూ.25 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పెగడపల్లి మండల కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించే ఎస్సీ సంక్షేమ వసతి గృహం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నంచర్లలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
63 కల్యాణలక్ష్మి, 47 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 63 మందికి కల్యాణలక్ష్మి, 47 మందికి రూ.11.26 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోలి శోభ-సురేందర్రెడ్డి, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, విండో చైర్మన్లు వోరుగంటి రమణారావు, మంత్రి వేణుగోపాల్, కర్ర భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లోక నిర్మలామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు ఉప్పుగండ్ల నరేందర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, సర్పంచులు గుర్రం అనూష-మల్లారెడ్డి, మేగ్గు శ్రీనివాస్, ఉమ్మెంతుల వనజ-భాస్కర్రెడ్డి, గొర్రె భాగ్యలక్ష్మి-ప్రశాంత్, ఎంపీటీసీలు గుర్రం స్వాతి-తిరుపతిరెడ్డి, బొమ్మెన జమున-స్వామి, మందపల్లి అంజయ్య, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీవో పుల్లయ్య, పార్టీ మండలాధ్యక్ష, కార్యదర్శులు లోక మల్లారెడ్డి, బండి వెంకన్న, యూత్ అధ్యక్షుడు సొల్లేటి సంతోష్, మహిళా అధ్యక్షురాలు సుంకరి మమత, నాయకులు పాల్గొన్నారు.