సాగునీటి రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖించింది. వట్టిపోయిన శ్రీరాంసాగర్ జలాశయానికి కాళేశ్వర జలాలతో జీవం పోయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరింది. ఐదు రోజులుగా కాళేశ్వరం ఎత్తిపోతలు సాగుతుండగా, వరదకాలువ జీవనదిలా మారింది. రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంప్హౌస్ల మీదుగా 102 కిలోమీటర్లు ప్రవహించిన గోదావరి, శుక్రవారం సాయంత్రం శ్రీరామసాగరాన్ని ముద్దాడి, పునర్జీవ పథకాన్ని పరిపూర్ణం చేసింది. ప్రాజెక్టులో భారీగా జలాలు చేరుతుండగా, ఎదురెక్కిన నీళ్లను చూసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాళేశ్వర గంగ ఉప్పొంగింది. ఉత్తర తెలంగాణ వరదాయినీ శ్రీరాంసాగర్ను ముద్దాడింది. ఎస్సారెస్పీ ఆయకట్టుకు జీవం పోయడమే లక్ష్యంగా ఐదు రోజులు విజయవంతంగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అక్కడ లింక్-1,2లో లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఇక్కడ గాయత్రీ పంప్హౌస్ దాకా నిర్విరామంగా పంపింగ్ కొనసాగుతుండగా, పునర్జీవ పథకంలోనూ దిగ్విజయంగా ఎత్తిపోతలతో శుక్రవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు జలాలు చేరాయి.
కరీంనగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం ఆశలను వమ్ము చేసే పరిస్థితికి చేరుకున్నది. పై రాష్ర్టాలు పలు ప్రాజెక్టులు కట్టడం, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వంటి అనేక కారణాలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగాన్ని దెబ్బ తీశాయి. నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లుంటే.. ఎత్తిపోయాల్సినవసరం లేకుండా ఆయకట్టు మొత్తానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి ఆస్కారముంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు స్టేజ్-1 స్టేజ్-2 కింద కలుపుకొని 13.55 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినా.. సమైక్య పాలనలో ఏనాడూ ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాలకు మించి ఇవ్వలేదు. వట్టిపోతున్న ప్రదాయినికి జీవం పోయాలన్న ఆలోచన కూడా నాటి పాలకులెవరూ చేయలేదు.
కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గత పాలకులకు భిన్నంగా ఆలోచించారు. వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలతో జీవం పోసి.. తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 1999.56 కోట్లతో చేపట్టిన ఈ పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద శంకుస్థాపన చేశారు. శరవేగంగా పనులు పూర్తి చేయించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ (వరద కాలువ 73వ కిలోమీటర్) వద్ద మొదటి పంపుహౌస్, అలాగే ఇదే జిల్లాలోని మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34 కిలోమీటర్) వద్ద రెండో పంపుహౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ (0.10 కిలోమీటర్) వద్ద మూడో పంపుహౌస్ను నిర్మించారు. ప్రతి పంపుహౌస్లో ఎనిమిది మోటర్లు ఏర్పాటు చేశారు. పునర్జీవంలో భాగంగా.. ముందుగా రాంపూర్ పంపుహౌస్ నుంచి రాజేశ్వర్రావుపేటకు, ఆ తర్వాత అక్కడి నుంచి ముప్కాల్కు, ముప్కాల్ పంపు నుంచి ఎస్పారెస్పీకి నీటిని ఎత్తిపోస్తారు.
ఫలించిన పునర్జీవ లక్ష్యం
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాళేశ్వర జలాలతో నింపి, ఆయకట్టు రైతులకు భరోసానివ్వాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రారంభించారు. ఐదు రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుండగా, లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్రీ పంప్హౌస్కు చేరుకుంటున్న జలాలు, అక్కడి నుంచి ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి. అవి వరద కాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తున్నాయి. వరద కాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన హెడ్రెగ్యులేటరీ గేట్లు బిగించడంతో ఎగువకు ఎదురెక్కుతున్నాయి. 73వ మైలురాయి వద్ద నిర్మించిన రాంపూర్ పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5,800 క్యూసెక్కులను ఎత్తిపోస్తుండగా, అవి అక్కడి నుంచి రాజేశ్వర్రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటరు) పంపుహౌస్ను దాటాయి. అక్కడ మూడు మోటర్లను ఆన్ చేసి 4,350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగా, వరద కాలువలో జలాలు ఎదురెక్కుతూ నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ (వరదకాలువ 0.10 కిలోమీటర్) పంపుహౌస్ చేరాయి. సాయంత్రం 4గంటలకు నాలుగు మోటర్లతో నేరుగా ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయడంతో అనుకున్న లక్ష్యం నెరవేరింది.
ఇదీ వరద కాలువ చరిత్ర
అప్పట్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదొలిచ్చినప్పడు నీరంతా వృథాగా పోయేది. ఆ జలాలను వినియోగించుకొని, దిగువకు ఇవ్వాలన్న లక్ష్యంతో వరదకాలువకు బీజం పడింది. 1991లో ఆనాటి ప్రధాని పీవీ నర్సింహారావు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం సమీపంలోనే వరదకాలువకు శంకుస్థాపన చేశారు. 1,070 అడుగుల నీటి మట్టం వద్ద వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆరు గేట్లతో నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. 1,074 అడుగుల నీటి మట్టం వరకు ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీటి విడుదల చేసుకునేలా 122 కిలోమీటర్ల పొడవుతో వరద కాలువను నిర్మించారు.
ఈ కాలువ ద్వారా దిగువకు 20 టీంఎసీల నీటిని తరలించి, 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అదించాలని ఆనాడు నిర్ణయించారు. కానీ, ఏనాడూ ఆ లక్ష్యం నెరవేరలేదు. నాటి పాలకులు నిర్లక్ష్యంతో కాలువ తవ్వడానికే 19 ఏండ్లు పట్టింది. 1991లో పనులు మొదలు పెడితే 2010లో ఆ కాలువను అందుబాటులోకి వచ్చింది. కానీ, ఆ కాలువ తెలంగాణ రాక ముందు వరకు పెద్దగా ఉపయోగపడింది లేదు. ఓ రెండు మూడు సార్లు మాత్రమే ఉపయోగపడింది. ఆ తదుపరి ఎస్సారెస్పీకి ఇన్ఫ్లో తగ్గి ఎడారిని తలపించింది. పక్కనే కాలువ ఉన్నా చుక్కనీరు లేక పక్కన భూములు ఎడారిని తలపించాయి. కానీ, అదే వరద కాలువ నేడు కాళేశ్వర జలాలతో 122 కిలోమీటర్ల మేర నిండుకుండను తలపిస్తున్నది. మొత్తంగా నాలుగు రిజర్వాయర్లుగా మారి.. దాదాపు రెండు టీఎంసీల నీటితో కళకళలాడుతున్నది.