Journalists protest | పెద్దపల్లి, డిసెంబర్ 27 : జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే H-143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం ఆడిషినల్ కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్-143 టెంజూ జిల్లా అధ్యక్షుడు కొట్టె సధానందం, టీయూడబ్ల్యూజే హెచ్-143, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంకరి ప్రకాష్, నాయకులు ఎర్రోజు వేణు లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 23వేల అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో అవి 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని.. ఇప్పుడు అది రద్దు చేసి, స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులివ్వాలని నిర్వహించడం దారుణమన్నారు.
గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడీ కోటాను రద్దుచేసి, ఫ్రీలాన్స్ కోటాలో.. అదీ కార్టూనిస్టులకే పరిమితం చేశారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండలస్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తారని ఆ జీవోలో పేర్కొనటం సరికాదని అన్నారు.
కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చేవారని, ఈ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ పై’ అక్రెడిటేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనటం సరికాదని వారన్నారు. ఈ జీవో ద్వారా చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటి కాయ అన్న చందంగా చిన్న పత్రికలపై కక్షసాధింపు ధోరణిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో అక్రెడిటేషన్ రూల్స్ ఫ్రేం చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, ఈ జీవోను సవరిచాంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే H-143 టెంజూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దసాని సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్, జిల్లా నాయకులు తిర్రీ తిరుపతి గౌడ్, కీర్తి రమేష్, దొమ్మటి రాజేష్, ఎన్డి తివారి, అర్కుటి మల్లేష్ యాదవ్, చిలపు కిషన్, కొయ్యడ తిరుపతి, తూర్పాటి శ్రీనివాస్, దుర్గం లక్ష్మణ్, తిర్రి సుధాకర్ గౌడ్, మార్పాక అంజి, డీఎల్ఎన్ చారీ, ఓం ప్రకాష్, షకీల్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.