కరీంనగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ నాయకుడు, గంగాధర సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త జైపాల్రెడ్డి మంగళవారం భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం జరుగుతున్న గొడవలు, డబ్బుల వసూళ్ల పర్వం గురించి తెలుసుకున్న ఆయన, పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై కొత్త జైపాల్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని తెలిపారు. సర్వేల పేరిట అభ్యర్థులకు ఆశలు చూపడం.. ఆ తదుపరి బేరసారాలు జరపడం.. అందులో తేడాలు వస్తే వారిని పక్కన పెట్టడం జరుగుతుందన్నారు. నిజానికి సర్వేల ప్రకారం గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని, కానీ అలా కాకుండా.. బేరసారాలు చేసి డబ్బులు ముట్టజెప్పిన వారికే టికెట్లు ఇస్తున్నదని విమర్శించారు. టికెట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందన్నారు.
అందుకే ఆ పార్టీలో చాలా మంది ఇముడ లేకపోతున్నారని తెలిపారు. పార్టీని వీడేందుకు టికెట్ల వ్యవహారంలో జరుగుతున్న ముడుపుల వ్యవహారం ఒక కారణం అయితే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి ప్రధాన కారణమన్నారు. నిజానికి గడిచిన తొమ్మిదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం సాధించనంత ప్రగతిని ముఖ్యమంత్రి సాధించారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఏదో ఒక పథకం ద్వారా ఫలాలు అందని కుటుంబాలు లేవన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుల సంక్షేమాన్ని విస్మరించడమే కాదు.. ఉచిత విద్యుత్ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నాయని, నిన్న గాక మొన్న గెలిచిన కర్ణాటక రాష్ట్రంలో పట్టుమని ఐదు గంటలు కూడా వ్యవసాయనికి కరెంటు ఇవ్వడం లేదని, అదే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు. ఏ రంగంలో చూసినా కేసీఆర్ సారథ్యంలో.. రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, అందుకే కాంగ్రెస్ను వీడి మంగళవారం తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
మైత్రి గ్రూప్ చైర్మన్గా కొనసాగుతున్న కొత్త జైపాల్రెడ్డి కరీంనగర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు వ్యాపారవేత్తగా, అటు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టే సేవకుడిగా కొనసాగుతున్న ఆయనకు ఈ రెండు నియోజకవర్గాల్లోని చాలా వర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందిన కొత్త జైపాల్రెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకోవడాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి.
గంగాధర సింగిల్ విండో చైర్మన్గా గతంలో పని వేసిన కొత్త జైపాల్ రెడ్డి టీడీపీలోనూ సీనియర్ నాయకుడిగా, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొనసాగుతూనే పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పేదలకు అండగా నిలుస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతున్నారు. బీఆర్ఎస్లో చేరడం వల్ల కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు బలం కలిసి వచ్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.