HomeKarimnagarJagtial Kavitha Performs Poojas In Kondagattu Shrine
కొండగట్టు మహిమాన్విత క్షేత్రం
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతో పాటూ పునర్నిర్మాణం వేగవంతంగా సాగుతుందని చెప్పారు.
ఆలయాభివృద్ధి ముఖ్యమంత్రి సంకల్పం
అందరం భాగస్వాములవుదాం
రానున్న రోజుల్లో గుడి విస్తరణ, పునర్నిర్మాణం వేగవంతం
అంజన్న అంటేనే అభయం, విజయం, ఉత్సాహం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అంజన్నను దర్శించుకొని పూజలు
108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి హాజరు
పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
కొండగట్టు మహిమాన్విత క్షేత్రం. అంజన్న అంటేనే అభయం, విజయం, ఉత్సాహం. నాకు అంజన్న అంటే అమితమైన ఇష్టం. ఆనాడు సీతమ్మ కన్నీటిని తొలగించిన వాడు కనుకనే నేను సైతం స్వామివారిని అమితంగా విశ్వసిస్తున్నా. రాబోయే రోజుల్లో సైతం మహిళాలోకం సుభిక్షంగా, క్షేమంగా ఉండేలా స్వామివారు అనుగ్రహం ప్రసాదిస్తారు. స్వామివారి దయ, కృప వల్ల హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తున్నాం. కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పం. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదాం. అందులో పాలుపంచుకోవడం వల్ల నా జన్మధన్యమవుతుంది.
మల్యాల/ కొడిమ్యాల, మే 10 : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతో పాటూ పునర్నిర్మాణం వేగవంతంగా సాగుతుందని చెప్పారు. మల్యాల మండలం కొండగట్టు ఆలయ అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొండపైకి చేరుకుని భేతాళస్వామి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ప్రధాన ఆలయంలో పూజలు చేసి స్వామివారికి పూజసామగ్రితోపాటు పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో నిర్వహించిన అంజన్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, కోరిన కోర్కెలు తీర్చేవాడిగా కొండగట్టు అంజన్నను భక్తులు విశ్వసిస్తారన్నారు. అంజన్న అంటేనే అభయం, ధైర్యం, విజయం, ఉత్సాహం, ఆనందం, సంజీవనిలాంటివాడన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అత్యధికంగా విశ్వసించడం వల్లే ప్రతీ గ్రామ కూడలిలో హనుమాన్ ఆలయాలు ఉన్నాయన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు చాలీసా పారాయణానికి మించిన ఔషధం లేదని ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్ చేసిన సూచన మేరకు అంజన్న సేవాసమితిని ఏర్పాటు చేసి మూడేళ్లుగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కాశీలోని వారణాసిలో ఉన్న సంకట హనుమాన్లాంటి పవిత్ర ఆలయంలోని సిద్ధాంతులు సైతం కొండగట్టు హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారని, ఆ మేరకు మూడేళ్ల క్రితం ప్రారంభించి కొనసాగిస్తున్నామన్నారు. ఆంజనేయస్వామిపై ఉన్న అపారమైన భక్తి వల్ల లక్షలాది మంది దీక్షలను స్వీకరించి పాదయాత్రగా సుదూర ప్రాంతాల నుంచి చిన్న, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు తరలివస్తున్నారని చెప్పారు. మహిమాన్వితమైన కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత కలిసి విన్నవించామని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే కొండగట్టు ఆలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు 100 కోట్లు ఇస్తామని, సీఎం కేసీఆర్ స్వయంగా కొండగట్టులో పర్యటించి 500 కోట్లను ప్రకటించారని గుర్తుచేశారు. నిధుల విడుదల ప్రకటనతోపాటు ఆలయ అభివృద్ధి విషయమై తీసుకున్న నిర్ణయాన్ని హర్షణీయంగా భావిస్తున్నామన్నారు. కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ కొనసాగిన సమయంలో కొండగట్టు ఆలయం చుట్టూ ఉన్న అటవీశాఖ భూములను రెవెన్యూకు మార్చడంతోపాటు ఆలయ అభివృద్ధి కోసం 350 ఎకరాలకు పైగా ఆంజనేయస్వామికి ప్రభుత్వం అందజేసిందన్నారు. అనంతరం ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి హాజరవుతున్న బోగ శ్రీనివాస్, మిట్టపల్లి లక్ష్మీనారాయణ భజన మండలి సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు సుంకె రవిశంకర్-దీవెన, మాకునూరి సంజయ్కుమార్-రాధిక, జడ్పీ చైర్పర్సన్ దంపతులు దావ వసంత-సురేశ్, కోరుట్ల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సరోజనమ్మ, డాక్టర్ సంజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్బీఎస్ అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, ముత్యంపేట సర్పంచ్ బద్దం తిపుపతిరెడ్డి, మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమల, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ సుజాత, జడ్పీటీసీలు నాగం భూమయ్య, పునుగోటి ప్రశాంతి, జాదవ్ అశ్విని, కొడిమ్యాల ఎంపీపీ మేన్నేని స్వర్నలత, జగిత్యాల ఆర్దీవో మాధురి, మల్యాల తహసీల్దార్ సుజాత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీర్ల వెంకటేశ్వర్రావు, మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, మేన్నేని రాజనర్సింగరావు, లోక బాపురెడ్డి, అయిల్నేని సాగర్రావు, జనగం శ్రీనివాస్, కొరండ్ల నరేందర్ రెడ్డి, నాగేశ్వర్రావు, జాగృతి నాయకులు పాసుల చరణ్, నీలగిరి రాజేందర్ రావు, వెంకటేశ్వర్రావు, వొల్లాల శ్రీనివాస్గౌడ్, ఉజ్జగిరి జమున, తాటిపాముల రాజేందర్, పుల్ల అరున్ తదితరులు పాల్గొన్నారు.