జగిత్యాల, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ నెల 20న జగిత్యాలలో జనహిత సభ నిర్వహిస్తామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతానని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రకటించారు. నాలుగున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్కు సేవ చేసినా పార్టీ అవమానించడంతో ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన, బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ను కలిసి సుధీర్ఘంగా చర్చలు జరిపారు.
ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత సురేశ్, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, శ్రీనివాసరెడ్డి, తదితరులతో కలిసి జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ కోసం స్థల పరిశీలించారు.
జగిత్యాల పట్టణంలోని మినీస్టేడియం, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానం, మోతె శివారులో స్థలాలను పరిశీలించారు. మోతె రోడ్డు వద్ద ఉన్న దాదాపు 20 ఎకరాల స్థలంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. స్థల పరిశీలన సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆశించిన మరింత మెరుగైన పాలన, అదనపు ప్రయోజనాలను అందించలేకపోయిందని విమర్శించారు. అభివృద్ధి పథంలో కాకుండా తిరోగమన దిశలో సాగుతుందని మండిపడ్డారు.
రెండున్నరేండ్ల కాలంలోనే ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి..’ అన్న ఆలోచన ప్రజల్లో వచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం నడుంబిగించి కొట్లాడి సాధించిన కేసీఆర్, మరోసారి రాష్ర్టానికి నేతృత్వం వహించాల్సిన అవసరం ఉందని, ప్రజల మేలు కోసం కేసీఆర్తో కలిసి నడిచే అవకాశం రావడం సంతోషంగా ఉందని వివరించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నారు.