జగిత్యాల, ఫిబ్రవరి 24, (నమస్తే తెలంగాణ) : రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణ పేరిట డ్రామా మొదలు పెట్టిందని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదనే విషయాన్ని గుర్తించి, బీఆర్ఎస్కు చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితపై రాజకీయంగా కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. ఇప్పటికే పలుసార్లు ఆమెను ఇబ్బంది పెట్టిందని, ఎన్నికల తరుణంలో మరోసారి సీఆర్పీసీ 41 నోటీసులంటూ బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఫోన్లు ధ్వంసం చేశారన్న పుకార్లు పుట్టించి బద్నాం చేశారని, అయినా కవిత తన సెల్ఫోన్లను దర్యాప్తు సంస్థలకు అప్పగించి తన నిజాయితీని ప్రదర్శించారని చెప్పారు.
భారత రాజ్యంగం మహిళలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు అనుగుణంగా విచారణ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఆ అంశం కోర్టులో ఉండగానే బీజేపీ ప్రభుత్వం ఈసారి ఈడీకి బదులుగా సీబీఐని ఉసిగొల్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయినా కేం ద్రంలోని బీజేపీ తన మాట వినని నాయకులు, ప్ర జాప్రతినిధులపై వేధింపులకు పాల్పడుతూనే ఉం దని ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలోని నాయకులపై కేసులు నమోదు చేస్తున్నదని, తమ ఆధీనంలో ఉన్న ఈడీ, సీబీఐ, ఇంటలిజెన్స్, ఇన్కంటాక్స్ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ నే ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు విన్నవారిపై ఎంత పెద్ద ఆరోపణలు ఉన్నా దాడులు చే యరని విమర్శించారు. దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెట్టాలన్న బీజేపీ ఆలోచనలు తెలంగాణలో నడువవని హెచ్చరించారు. ఉద్యమ కాలం నుంచి ఇలాంటి బెదిరింపులు వేలకొద్దీ ఎదుర్కొన్నామని, అలాంటి హూంకరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.