జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్ అడ్డాగా మారిపోయింది. విలువైన ఖాళీ స్థలాల వివరాలను సేకరించి కబ్జాదారులతో కుమ్మక్కై, వీఎల్టీ ఆధారంగా కబ్జా పెట్టడం ఇక్కడ షరామామూలై పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి వెనుక అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగితోపాటు, లోపాయికారిగా మరికొందరు అధికారులకు సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారుల అవినీతి, కబ్జాదారుల కుమ్మక్కు ఎంత దూరం వెళ్లిందంటే ఓ భారీ భూ బాగోతం కండ్లకు కడుతున్నది.
13 ఏండ్ల క్రితం ఓ గ్రామ పంచాయతీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పన్నిన కుట్ర బయటపడింది. ఈ ప్రక్రియ మొత్తం, అందుకు సంబంధించిన పత్రాలు పరిశీలిస్తే అనేక లోపాలు, జారీలో అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాల్సి ఉన్నదని ప్రజానీకం పేర్కొంటున్నది.
జగిత్యాల, మే 26 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల రూరల్: జగిత్యాల పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నది హస్నాబాద్. ఆ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 1599లో 12 గుంటల భూమిని మండ పెద్ద రాజిరెడ్డి, మండ శ్రీనివాస్ తమకు చెందిన 12 గుంటల వ్యవసాయ భూమిని (పట్టాదారుపాసు పుస్తకం 286053, 54) పుల్ల భాగ్యలక్ష్మికి 2008లో మార్చి 17న (873/2008 డాక్యుమెంట్ నెంబర్) రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి 2011 వరకు పుల్ల భాగ్యలక్ష్మి ఆధీనంలోనే ఆ భూమి ఉన్నది. కాగా, 2011లో పుల్ల భాగ్యలక్ష్మి వద్ద 12 గుంటల భూమిని కీర్తి విజయలక్ష్మి, వూటూరి గీతారాణి, గొల్లపెల్లి సత్యనారాయణ కొనుగోలు చేశారు. పుల్ల భాగ్యలక్ష్మి ముగ్గురికి 4660/2011 డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి కీర్తి విజయలక్ష్మి, వూటూరి గీతారాణి, సత్యనారాయణ ఆదీనంలో ఆ భూమి ఉన్నది.
భూమి ఖాళీగా ఉండడంతో కబ్జారాయుళ్లు కన్నేశారు. భూమిని కాజేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో హస్నాబాద్ పంచాయతీ పరిధిలో ఉన్న భూమికి జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తిపన్ను అసెస్మెంట్ పత్రాన్ని సృష్టించారు. సర్వే నంబర్ 1599లోని 722 చదరపు గజాల ఖాళీ స్థలానికి 1999 లోనే ఆస్తిపన్ను అసెస్మెంట్ జరిగినట్లు ఇంటి నంబర్ 4-4-325/13-సి/బి/ 1350/1999తో ఖాజా అమీరొద్దీన్ తండ్రిపేరు ఖాజా రుక్నొద్దీన్ పేరిట పత్రా న్ని తయారు చేశారు.
దీనికి 2011 – 2015 మధ్య జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన జేఆర్ సురేశ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాన్ని సృష్టించారు. దీని ఆధారంగా ఆన్లైన్లో 2012 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు 13 ఏండ్ల వీఎల్టీని ఈ నెల 3న చెల్లించారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్టీ) అసెస్మెంట్ కాపీ ఆధారంగా మరో వ్యక్తికి భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు వ్యూహం రచించారు.
అయితే అసెస్మెంట్ పత్రంలో అనేక అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అయితే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ పత్రాల ఆధారంగా ఇంటి నిర్మాణం చేసుకోకున్నా, మున్సిపాలిటీ పరిధిలో ఇంటినెంబర్ను కేటాయించుకొనేందుకు వీఎల్టీ ఉపయోగపడుతుంది. అయితే వీఎల్టీ ఇచ్చిన అవకాశాన్ని అధికారులు, కబ్జాదారులు అవకాశంగా తీసుకొని కబ్జాకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమీరొద్దీన్ పేరిట రూపొందించిన ఆస్తిపన్ను అసెస్మెంట్ పత్రంలో అతడిని యజమానిగా పేర్కొన్న అధికారులు, 1999లోనే ఇంటి నంబర్ను కేటాయించినట్లుగా పేర్కొన్నారు. వీఎల్టీని మాత్రం 2012 నవంబర్ నుంచి తీసుకున్నట్టు చూపారు.
వీఎల్టీ టాక్స్ ఒకేసారి పదమూడేండ్లకు చెల్లించడం, అది కూడా 2025 మార్చి 31వ తేదీ వరకు చెల్లించడం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అన్నింటి కంటే విచిత్రమైన విషయం ఏం టంటే.. ఆరేండ్ల క్రితం వరకు సర్వేనంబర్ 1599 హ స్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. 2018 లో జగిత్యాల మున్సిపల్ పరిధి విస్తరణ సమయంలో హస్నాబాద్ జీపీ భూములను ఆధీనంలోకి తీసుకువచ్చారు. కానీ, సిబ్బంది మాత్రం 1999లోనే ఇంటి నంబర్ను కేటాయించడం, 2012 నుంచి వీఎల్టీ ట్యాక్స్ను తీసుకోవడం విస్మయానికి గురి చేస్తున్నది.
సర్వే నంబర్ 1599లో 6 గుంటల భూమిని మున్సిపల్ అధికారులు, సిబ్బంది అండదండలతోనే కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరేండ్ల క్రితం మున్సిపల్ పరిధిలోకి వచ్చిన భూమికి పాతికేండ్ల క్రితమే ఇంటి నంబర్ ఇచ్చినట్టు, ఆస్తి అసెస్మెంట్ చేసినట్టు పత్రాలు సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కబ్జా ప్రయత్నం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా రౌడీ షీటర్లు, కబ్జారాయిళ్లతో దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతున్నది.
జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఇది తొలి వ్యవహారం కాదని, కొన్నాళ్లుగా ఇలాంటి కబ్జా ప్రయత్నాలు నిరాటకంగా కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఒక అధికారి, ఒక దిగువ స్థాయి అధికారి ఇలాంటి కబ్జాల వెనక ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో సహకరించినందుకు కబ్జారాయుళ్లతో 15లక్షల డీల్ చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్లో అవినీతి పనులన్నింటికీ కీలక సూత్రధారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్లు (ప్రతిపక్షం, అధికారపక్షం) అందరూ కలిసి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్బాడీస్)కు ఫిర్యాదు చేసినా.. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోనట్టు సమచారం. కాగా ఈ వ్యవహారాల్లో మున్సిపల్ కీలక అధికారి ప్రమేయం ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్వే నంబర్ 1599లో 722 చదరపు గజాలకు సంబంధించిన అసెస్మెంట్ అంశం నా దృష్టికి వచ్చింది. వీఎల్టీ అసెస్మెంట్ పత్రాలను పరిశీలిస్తున్నాం. అసెస్మెంట్ పొందిన వ్యక్తి మొదటగా ఇంటి నంబర్ పొందిన సమయంలో మున్సిపల్ కార్యాలయంలో సబ్మిట్ చేసిన స్థల రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వాలని అడిగాం.
అసెస్మెంట్ పత్రాల్లో తప్పులున్నాయని, అవకతవకలు జరిగాయని తేలితే అసెస్మెంట్ను క్యాన్సల్ చేయడంతో పాటు తప్పుడు సమచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతాం. అలాగే వ్యవహారంలో మున్సిపల్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు, రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు తేలితే వారిపై సైతం శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇక మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న వ్యవహారం నా దృష్టికి రాలేదు. దానిపైనా విచారణ చేపడతాం.
– అనిల్బాబు, జగిత్యాల మున్సిపల్ కమిషనర్