సారంగాపూర్, మార్చి 28: అస్తమానం కేసీఆర్ను విమర్శించడం మాని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు కావాలనే సీఎం రేవంత్రెడ్డిని తప్పుదోవ పట్టించారని, ప్రాజెక్టు దండుగ అని చెప్పి రైతులకు నీటి కష్టాలు తెచ్చిన పాపం కూడా వారిదేనని మండిపడ్డారు. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను పునరుద్ధరించాలని, మేడిగడ్డ వద్ద కుంగిన మూడు పిల్లర్లను బాగుచేసి సాగునీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం సాయంత్రం సారంగాపూర్ మండలం పోతారంలో ఎండిన పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గంలో రైతులకు నష్టం జరుగుతున్నా ఇక్కడి సీనియర్ నాయకులు ఎందుకు స్పందించడం లేదో..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఆయకట్టు పెరగడంతో 30 ఏండ్ల కిందటి నుంచే సాగునీటి సమస్యలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.
కానీ, కేసీఆర్ సర్కారు మాత్రం కాళేశ్వరం ద్వారా నీటి కొరత లేకుండా చేసిందని, పచ్చని పంటలు పండాయని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ పాత కథే అయిందని, రైతులకు పెట్టుబడి సాయం అందకపోగా నేడు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ స్టేజ్1లోనే నీటి కొరత ఉంటే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటదో..? అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు.
రైతులు మళ్లీ జేసీబీలు, క్రేన్ల సహాయంతో పూడిక తీసే రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ఎంపీపీ సొల్లు సురేందర్, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీ జోగిన్పల్లి సుధాకర్ రావు, నాయకులు ఢిల్లీ రామారావు, నర్సింహారెడ్డి, సాయిలు, మదన్కుమార్, తేలు రాజు, మహేశ్, శేఖర్, రైతులు రాజనర్సు, లచ్చయ్య, గంగయ్య, వెంకటి, అఖిల్, మల్లేశ్ ఉన్నారు.