ఆటో డ్రైవర్లు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ బతుకులు రోడ్డునపడ్డాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు. జగిత్యాల సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.
– జగిత్యాల అర్బన్/ చొప్పదండి, డిసెంబర్ 18
జగిత్యాల అర్బన్/ చొప్పదండి, డిసెంబర్ 18: ఆటోడ్రైవర్ల ఆందోళన కొనసాగుతున్నది. రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నది. సోమవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అగ్గిరాజుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం తెచ్చి తమ పొట్టకొట్టిందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మీ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. సోమవారం జగిత్యాల డీజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ తీశారు.
ఆటో యజమాని, డ్రైవర్కు నెలకు రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ ప్రజావాణిలో జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు వినతిపత్రాన్ని అందజేశారు. రాయికల్లో ఆటోడ్రైవర్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శాంతియత నిరసన ప్రదర్శన చేపట్టారు. పెగడపల్లి, గొల్లపల్లిలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ తీశారు. అలాగే చొప్పదండి పట్టణంలో మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆయాచోట్ల కార్మికులు మాట్లాడారు.
బస్సు ఫ్రీతో తమకు గిరాకీ లేకుండా పోయిందని, ఆటోల ఈఎంఐలు కట్టలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేదంటే తమపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వారికి ప్రతి నెలా 10వేల జీవన భృతి చెల్లించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన ర్యాలీకి మద్దతు పలికి, మాట్లాడారు. మహాలక్ష్మీ పథకంతో జిల్లాలోని 40వేల ఆటో యజమానులు, ఆటో డ్రైవర్లు ఉపాధి ప్రమాదంలో పడిందని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం స్పందించేదాకా వారి తరపున పోరాటం సాగిస్తామన్నారు.
మరోవైపు జిల్లాలోని ప్రతి రూట్లో బస్సులను నడిపించి ఉచిత ప్రయాణాన్ని మహిళలకు చేరువచేయాలని సూచించారు. బస్సు ఫ్రీ చేసిన ప్రభుత్వం, ఆడబిడ్డలకు తులం బంగారం, ప్రతి మహిళకు 2500 పెన్షన్ ఇచ్చే విషయంలో పక్కదారి పట్టిస్తున్నారని మండి పడ్డారు. ఈ ధర్నాలో డీజిల్ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆరుముల్ల శ్రీనివాస్, ఆటో కార్మికులు ఉన్నారు.