‘అభివృద్ధి.. సంక్షేమమే మా పథం. అవి రెండే తారక మంత్రంగా మా పార్టీ బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్గదర్శకంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపాం. విద్య వైద్యాన్ని బలోపేతం చేశాం. మెడికల్ కాలేజీతోపాటు అనుబంధంగా దవాఖాన ఏర్పాటు చేసుకున్నాం. వ్యవసాయాన్ని పండుగలా మార్చాం. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా మార్చుకోగలిగాం. అన్నింటికంటే ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికే తలమానికంగా నూకపెల్లి వద్ద 4500 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నాం. త్వరలోనే అర్హులకు అందిస్తాం’ అని జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలపై పూర్తి నమ్మకం ఉందని, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్గదర్శకంలో మరోసారి కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
– జగిత్యాల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్గదర్శకంలో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపామని జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్కుమార్ స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని, రాష్ట్ర సర్కారు రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. దశాబ్దం క్రితం 20వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యేదని, ఇప్పుడు 60 వేల ఎకరాలకు చేరిందన్నారు. విద్యుత్ రంగంలో జగిత్యాల రికార్డు స్థాయి వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసుకొని ఉచిత విద్యుత్ను పొందుతున్నదన్నారు. తొమ్మిది గురుకుల పాఠశాలలు, ఒక గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని, జిల్లా కేంద్రం కావడంతో మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా దవాఖాన వచ్చిందన్నారు. డయాలసిస్ సెంటర్, మాతా శిశు సంరక్షణ కేంద్రం, వైరాలజీ, టీహబ్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 50 కోట్లతో జగిత్యాల మున్సిపాలిటీ, 25 కోట్లతో రాయికల్ మున్సిపాలిటీలు సర్వాంగ సుందరంగా మార్చుకున్నామన్నారు. సోమవారం ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
డాక్టర్ సంజయ్ : నేను 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. మొదటి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. అప్పుడు తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయా. ఆ తర్వాత అప్పటి నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో నాలుగున్నర ఏండ్లు నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశా. 2018లో పార్టీ మరోసారి నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చింది. 60వేలకు పైగా మెజార్టీతో గెలిచా. ఈ ఐదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ఎమ్మెల్సీ కవిత మార్గదర్శకంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశా. ఇప్పుడు మూడోసారి కూడా జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు అధినేత కేసీఆర్ కల్పించడం మరిచిపోలేనిది. చాలా హ్యాపీగా ఉన్నది.
నమస్తే : విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటీ?
డాక్టర్ సంజయ్ : రాష్ట్రం రాకముందు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాలు ఉండేటివి కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించారు. నాడు ఒక్క జగన్నాథ్పూర్లో మాత్రమే గురుకుల పాఠశాల అది కూడా ప్రాథమిక స్థాయిలో మినీ గురుకులం ఉండేది. కానీ, తొమ్మిదేళ్లలో ఒక్క జగిత్యాల నియోజకవర్గానికే కొత్తగా 9 గురుకుల పాఠశాలలు వచ్చాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా విద్యాబోధన అందులోనే సాగుతున్నది. ఇంకా ఒక గురుకుల డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసుకోగలిగాం. మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. నర్సింగ్ కాలేజీ ప్రారంభించుకున్నాం. జూనియర్ కాలేజీలన్నింటికీ సొంత భవనాలు సమకూర్చుకున్నాం. ‘మన ఊరు-మన బడి’ కింద 30 కోట్లతో పాఠశాలలను ఆధునీకరించుకుంటున్నాం. ప్రతి విద్యార్థికీ సన్నబియ్యంతో అన్నం, నాణ్యమైన స్కూల్ యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు అందజేస్తున్నాం.
నమస్తే : రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి ఏంటి?
డాక్టర్ సంజయ్ : జగిత్యాల నియోజకవర్గం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ప్రారంభం కావడంతో జగిత్యాల రూరల్ మండలంలోని చెరువులను నింపుకోగలిగాం. 135 కోట్లతో బీర్పూర్లో రోళ్లవాగు ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. కాకతీయ ప్రధాన కాలువ నుంచి డీ 52కి తూము ఏర్పాటు చేసుకోవడం వల్ల 40 కిలోమీటర్ల పొడవున సాగుకు నీటి సౌకర్యం పెరిగింది. ఆరు చెరువులు నిండిపోతున్నాయి. ఇక పెద్దవాగుపై ఐదు చోట్ల చెక్డ్యామ్లు కట్టుకోవడంతో వాగు సజీవంగా మారింది. మిషన్ కాకతీయ కింద 49 కోట్లతో 172 చెరువులను బాగు చేసుకున్నాం. భూగర్భజలాల పెరుగుదలతోపాటు 24 గంటల పాటు విద్యుత్ వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. పదేండ్ల క్రితం 20 వేల ఎకరాల్లో వరి సాగైతే ప్రస్తుతం 60వేల ఎకరాలకు పెరిగింది. అంటే సాగునీటి వసతి ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
నమస్తే : వైద్యరంగంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
డాక్టర్ సంజయ్ : ఒక వైద్యుడిగా చెబుతున్నా. వైద్యరంగంలో వచ్చిన మార్పులు మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఈ పదేండ్ల కాలంలో ఇంత గొప్పగా వృద్ధి చెందడం అంటే మాటలు కాదు. జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు కావడంతోపాటు అనుబంధంగా 650 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన వచ్చింది. అందులో 360 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ప్రొఫెసర్స్ పోస్టులు రావడంతో వైద్యసేవలకు అవకాశం పెరిగింది. మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. డయాలసిస్ సెంటర్తోపాటు టీహబ్, వైరాలజీ ల్యాబ్లు వచ్చాయి. ఆక్సీజన్ యూనిట్, సీటీస్కాన్ను ఏర్పాటు చేసుకున్నాం. ఎమ్మారై సైతం రాబోతున్నది. నియోజకవర్గంలో 25 పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు మంజూరయ్యాయి. రాయికల్ పీహెచ్సీని కమ్యునిటీ హెల్త్ సెంటర్గా మార్చుకున్నాం. బండలింగాపూర్ ప్రాథమిక కేంద్రానికి పోస్టులు మంజూరు చేయించి వినియోగంలోకి తెచ్చాం. త్వరలోనే బీర్పూర్లో పీహెచ్సీని ప్రారంభించనున్నాం.
నమస్తే : గెలుపు కోసం ఏం చేయబోతున్నారు?
డాక్టర్ సంజయ్ : ప్రత్యేకంగా ప్రణాళికలు ఏం లేవు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నా గెలుపునకు మార్గాలు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ముందుకెళ్తా. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ఆదరించాలని ప్రజలను కోరుతా. ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా విజయం నాదే. గత ఎన్నికల సమయంలో ఎలాగైతే జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమైందో మళ్లీ ఈ సారి ఇక్కడి నుంచే మొదలవుతుందన్న నమ్మకం ఉన్నది.
నమస్తే : మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఎలా జరిగింది?
డాక్టర్ సంజయ్ : మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించాం. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి దాదాపు 50 కోట్లను, రాయికల్ మున్సిపాలిటీకి 25 కోట్లను ప్రభుత్వం వివిధ గ్రాంట్లు, నిధుల రూపంలో ఇచ్చింది. వీటితో జగిత్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మార్చగలిగాం. పబ్లిక్ పార్కులను, జిమ్లను ఏర్పాటు చేశాం. మూడు చెరువులను సుందరీకరిస్తున్నాం. అంతర్గత రోడ్లు, మురుగు కాలువలను నిర్మించాం. వీధుల్లో రోడ్ల విస్తరణ చేపట్టాం. అలాగే పలు కూరగాయల మార్కెట్లను సైతం వృద్ధి చేశాం. 4కోట్లతో సమీకృత మార్కెట్ను విస్తరిస్తున్నాం. ఇక రైతుబజార్ను వినియోగంలోకి తెచ్చాం. రోడ్ల ఆక్రమణలను తొలగించి నిరుపేద వ్యాపారుల కోసం షెడ్లు వేయించగలిగాం.
నమస్తే : పరిపాలన వికేంద్రీకరణ వల్ల నియోజకవర్గానికి జరిగిన మేలేంటి?
డాక్టర్ సంజయ్ : పరిపాలన వికేంద్రీకరణ జగిత్యాల నియోజకవర్గానికి మేలు చేసింది. జిల్లా కేంద్రం కావడంతో నియోజకవర్గానికి అనేక సౌకర్యాలు సమకూరాయి. వందల కోట్ల వ్యయంతో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. మెడికల్ కాలేజీతోపాటు దవాఖానలు, ప్రధాన ఆఫీసులు ఏర్పాటయ్యాయి. దీంతో పాటే వ్యాపార, వాణిజ్య రంగాలు వృద్ధి చెందాయి. దీనికి తోడు జగిత్యాల నియోజకవర్గ కేంద్రం ఉత్తర తెలంగాణకు ఒక కీ పాయింట్గా మారిపోయింది. నిర్మల్, ఆర్మూర్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి మధ్య ఉండడంతో ఇది ఒక కీలక వ్యాపార కూడలిగా మారింది.
నమస్తే : నూకపెల్లి వద్ద నిర్మిస్తున్న ఇండ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు?
డాక్టర్ సంజయ్ : నూకపెల్లి వద్ద 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడం జగిత్యాల చరిత్రలోనే గొప్ప విషయం. ఇది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వల్లే సాధ్యమైంది. దాదాపు 300కోట్లతో ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అవస్థాపన సౌకర్యాలు సైతం కల్పిస్తున్నాం. 7 కోట్లతో మిషన్ భగీరథ నీటిని కాలనీకి అందించే ఏర్పాట్లు చేశాం. సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యాల కల్పన జరుగుతున్నది. త్వరలోనే అర్హులందరికీ ఇండ్లను పంపిణీ చేస్తాం.
నమస్తే : అభివృద్ధికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి?
డాక్టర్ సంజయ్ : నేను గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రణాళిక సిద్ధం చేశా. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయించడంతోపాటు కాలనీల్లో పూర్తి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. అలాగే యావర్రోడ్డు విస్తరణ పూర్తి చేయించాలి. దాంతోపాటు నియోజకవర్గంలో రోడ్లను విస్తరించాల్సిన అవసరమున్నది. కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు పూర్తిస్థాయిలో లేవు. వాటిని పూర్తి చేయాలి. అలాగే మెడికల్ కాలేజికి అనుబంధంగా ఏర్పాటైన దవాఖానను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చివేయాలన్న ప్రణాళికలున్నాయి.
నమస్తే : దశాబ్దాలుగా ఉన్న యావర్ రోడ్డు సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు?
డాక్టర్ సంజయ్ : యావర్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. 60 ఫీట్ల నుంచి వంద ఫీట్ల రోడ్డుగా మారుస్తాం. అందుకు జీవో కూడా తెచ్చాం. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీలను వెనక్కి జరిపాం. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వెనక్కి జరపాల్సి ఉంది. ఇండ్ల తొలగింపునకు పరిహారం చెల్లించాల్సి ఉన్నది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్కు విన్నవించాం. జీహెచ్ఎంసీ టీడీఆర్ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జీవో ఇచ్చారు. ఇంటి యజమానులకు మార్కెట్ విలువ ఆధారితంగా మూడు రెట్లు అధికంగా చెల్లించడానికి ఏర్పాట్లు చేశాం. త్వరలోనే పరిహారం చెల్లించి యావర్ రోడ్డు విస్తరణను పూర్తి చేస్తాం. ఇంకా పట్టణ ప్రజలకు ఇబ్బందిగా ఉన్న 12 జోన్లను కూడా సవరించాం. దీంతో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయాయి.
నమస్తే : సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి?
డాక్టర్ సంజయ్ : సంక్షేమ రంగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గడపగడపకూ ఫలాలు అందుతున్నాయి. నియోజకవర్గంలోనే దాదాపు 1.40 లక్షకు పైగా సంక్షేమ లబ్ధిదారులు ఉన్నారు. అందులో 49 వేల మంది పెన్షన్దారులు ఉన్నారు. 40వేలకు పైగా మంది రైతులు రైతుబంధు పొందుతున్నారు. 9 వేలకు పైగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పొందారు. ఇంకా దళితబంధు, బీసీలు, మైనార్టీలకు లక్షసాయం అందుతున్నది.
నమస్తే : విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు ఏంటీ?
డాక్టర్ సంజయ్ : ఒకప్పుడు లోవోల్టేజీ సమస్య వెంటాడేది. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు సరిగ్గా లేక చాలా అవస్థలు పడేది. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో గొప్ప సంస్కరణలు జరిగాయి. నియోజకవర్గంలో తొమ్మిది సబ్స్టేషన్లు నిర్మాణం చేసుకున్నాం. 3,500కు పైగా స్తంభాలు వేసుకున్నాం. వెయ్యికిపైగా ట్రాన్స్ఫార్మర్లను బిగించుకున్నాం. దాదాపు 300కోట్లకు పైగా నిధులు వెచ్చించి విద్యుత్ సంస్కరణలు తెచ్చాం. నాణ్యమైన కరెంట్ను ఇస్తున్నాం. రాష్ట్రంలోనే నేడు అత్యధిక వ్యవసాయ విద్యుత్ను వాడుతున్న జిల్లాగా, నియోజకవర్గంగా జగిత్యాల ఉందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు.