Sikasa | గోదావరిఖని, అక్టోబర్ 13: భారత విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారి ద్రోహం తలపెడుతున్న వేణుగోపాల్ ఆలోచనలు మార్చుకోవాలని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇన్నాళ్లు విప్లవ ముసుగు కప్పుకొని వాస్తవాలను వక్రబుద్ధితో వక్రీకరిస్తూ చరిత్రను తలకిందులుగా చూపడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.
ఈ సమాజంలో వర్గాలు అంతం కావాలని, కుల వివక్ష, ఆదిపత్యం, దోపిడి లేని సమాజం కోసం దేశంలో కొన్ని వందల యేళ్లుగా ప్రజలు పోరాటాలు కొనసాగిస్తున్నారని ఈ పోరాటాలను అనేక రూపాలలో కొనసాగించారనీ, సింగరేణిలో నిరసనలు. బంట్లు అనేక పోరాట రూపాలలో సింగరేణి ప్రారంభించిన తొలినాళ్ల నుంచి కొనసాగుతున్నాయనీ, జగిత్యాల జైత్రయాత్ర కాలం నుంచి సింగరేణిలో ఉద్యమాలకు సైరస్ మోగించారన్నారు.
సికాస ప్రారంభమైన 1982 నుంచి కార్మికోద్యమం భారతదేశంలో అన్ని బొగ్గు గనుల ఉద్యమాలకు ఆదర్శమైందనీ, తాగునీరు, విద్య, వైద్య, నివాస సౌకర్యాల కోసం సాగించిన నిరసనల వల్ల చాలా ఫలితాలు కార్మికులు సాధించగలిగారని పేర్కొన్నారు. రాజ్యం అమలుచేసిన అనేక రకాల నిర్బంధాలను భరిస్తూ అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. పోరాటాలు, త్యాగాలు లేనిదే హక్కులు సాధించలేమనేది సింగరేణి కార్మికుల జీవితాల్లో నిలిచిందన్నారు. సింగరేణి కార్మికుల పోరాట చరిత్ర వేణుగోపాల్కు తెలియనిది కాదని తెలిపారు. మార్క్స్ సిద్ధాంతం నుంచి కర్మ సిద్ధాంతంలోకి జారుకున్నాడని ఆరోపించారు. గత సంవత్సరం కాలంగా ఆయనలో మొదలైన తిరోగమనల ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మెల్లమెల్లగా ఒక గుంపును పోగు చేసుకుంటున్నాడని విమర్శించారు.
జీనుగు నరసింహారెడ్డి లాంటి ఒకరిద్దరిని ఏజెంట్లుగా పెట్టుకొని తేనె పూసిన కత్తిలాగా పని సాగించాడని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను హేళన చేస్తూ మనువాదుల ముహూర్తాలకు సహాయంను అందిస్తూ భారత విప్లవ పురోగమనాన్ని అడ్డుకోవడానికి పూనుకున్నాడని చెప్పారు. దోపిడీదారుల ఏజెంట్లు పాలకుల భాషనెత్తుకున్నాడని, మావోయిస్టు పార్టీలో, విప్లవ శ్రేణుల్లో ప్రజాస్వామ్యవాదుల్లో చివరకు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి పథకం ప్రకారం ఈ పని చేస్తున్నాడన్నారు.
పచ్చకామెర్ల రోగిలాగా ఇప్పుడు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నాడనీ, ఆయన చెప్తున్న సిద్ధాంతం చెల్లుబాటు కాదనేది తెలిసి కూడా గందరగోళం సృష్టిస్తున్నాడని చెప్పారు. సికాస తరఫున చికాగో అమరుల రక్తంతో మొదలైన ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ కార్మికుల హక్కుల సాధనలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.