జగిత్యాల/ కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) :రాష్ట్రంలో దశాబ్దాలుగా పాఠశాలల్లో క్రీడలు నిర్వహిస్తూ పిల్లల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియ కొనసాగింది. అందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలోనే మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో క్రీడలు నిర్వహించేవారు. అండర్-14, అండర్-17 స్థాయిల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించి బహమతులు ఇచ్చేవారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం, శిక్షణ శిబిరాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే కాలగమనంలో ఇవన్నీ కనిపించకుండా పోయాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోసం క్రీడల నిర్వహణకు గత ప్రభుత్వాలు నేరుగా నిధులు మంజూరు చేయలేదు. సందర్భాను సారంగా మాత్రమే నిధులు ఇస్తూ వచ్చాయి. కానీ, నిధులు సమకూర్చుకునేందుకు ఎస్జీఎఫ్లకు అవకాశం కల్పించాయి. ఏటా స్కూల్లో చేరే ప్రతి విద్యార్థి వద్ద నుంచి ఏడాదికి 10 చొప్పున వసూలు చేసేవి. ఇందులో నుంచి 6 ఎస్జీఎఫ్కు పంపించేవి. మిగిలిన 4తో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలు, క్రీడల నిర్వహణ కోసం వెచ్చించేవారు. ఈ విధానం దశాబ్దాల పాటు కొనసాగుతూ రాగా, 2013లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టంతో బ్రేక్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదని చట్టం పేర్కొంది. ఫలితంగా ఎస్జీఎఫ్లకు నిధులు లేకుండాపోవడంతో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలుకు, క్రీడల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది.
నాడు చేష్టలుడిగిన ఎస్జీఎఫ్..
విద్యాహక్కు చట్టం 2013 అమల్లోకి రావడంతో పాఠశాలల్లో క్రీడలు తగ్గిపోయాయి. ఎస్జీఎఫ్కు నిధులు లేకపోవడంతో ఎలాంటి క్రీడలను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. పాఠశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల నిర్వహణ తగ్గిపోయింది. పాఠశాలల్లో క్రీడా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నప్పటికీ, క్రీడలకు నిధుల కేటాయింపు లేకపోవడం, కనీసం నిధులు సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడంతో క్రీడలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పిల్లల్లోనూ నిరాసక్తత నెలకొంది. కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు, పీఈటీలు, గ్రామస్తులను కలిసి వారి సహాయ, సహకారాలతో క్రీడలను నిర్వహించే ప్రయత్నం చేసినా ఇది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేకపోయింది. కేవలం పాఠశాల స్థాయిలో మాత్రమే ఆడుకునేందుకు గ్రామస్తులు సహకరించారు. దీనికి తోడు మూడేండ్లుగా కరోనా విజృంభించడం, స్కూళ్లు మూతపడడంతో క్రీడలు అటకెక్కాయి.
స్వరాష్ట్రంలో చొరవ.. నిధులు మంజూరు
క్రీడల ప్రాధాన్యత తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. విద్యాహక్కు చట్టం 1 నుంచి 8వ తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్యను ప్రకటించి, వారికి మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తూ వస్తున్నది. ఇక 9, 10వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే బియ్యం, కూరగాయలకు నిధులు, వంట మనుషులకు కేంద్ర ప్రభుత్వం చార్జీలు ఇవ్వడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వమే నిధులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఎలాగైతే 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారో అలాగే నేరుగా ప్రతి పాఠశాలకు క్రీడా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 10వేల చొప్పున క్రీడా నిధులను మంజూరు చేసింది. పాఠశాల అకౌంట్లలో డబ్బులను ఇప్పటికే జమ చేసింది.
క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశం
క్రీడల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సర్కారు, సదరు పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశాన్ని కల్పించింది. ఏయే క్రీడలకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేయాలో ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ప్లాస్టిక్, చెక్కతో చేసిన క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, సాఫ్ట్బాల్, టెన్నిస్బాల్, ప్లాస్టిక్ బాల్స్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీసాఫ్ట్, బీన్బ్యాగ్స్, సాకర్కోన్, ప్యారాషూట్, షాట్పుట్, డిస్కస్, షోమ్, జావెలిన్ త్రో వంటి క్రీడా పరికరాలు, ఉన్నత పాఠశాలల్లో స్కిప్పింగ్ రోప్స్, త్రోబాల్, ప్రథమ చికిత్స కిట్లు కొనుగోలుకు అవకాశం ఇచ్చింది. అథ్లెటిక్స్కు సంబంధించిన సామగ్రిని సైతం సమకూర్చుకోవాలని సూచించింది.
జగిత్యాల జిల్లాకు 52.75 లక్షలు
జగిత్యాల జిల్లాలో 511 ప్రాథమిక పాఠశాలలకు 25.55 లక్షలు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలకు 8.50 లక్షలు, 187 ఉన్నత పాఠశాలలకు 18.70 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 783 పాఠశాలలకు 52.75 లక్షలు అందించింది. జిల్లాలో 38,834 మంది విద్యార్థులు ప్రైమరీ స్కూళ్లలో విద్యాభ్యాసం చేస్తుండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20,864 మంది, ఉన్నత పాఠశాలల్లో 12,711 మంది చదువుతున్నారు. క్రీడా నిధులతో మొత్తంగా 72,409 మందికి ప్రయోజనం కలుగనున్నది.
కరీంనగర్ జిల్లాకు 42.90 లక్షలు
జిల్లాలో 426 ప్రాథమిక పాఠశాలలకు 21.30 లక్షలు, 67 ప్రాథమికోన్నత పాఠశాలలకు 6.70 లక్షలు, 149 ఉన్నత పాఠశాలలకు 14.90లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 651 పాఠశాలలకు 42.90 లక్షలు అందించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు 31.40లక్షలు
జిల్లాలో 332 ప్రాథమిక పాఠశాలలకు 16.60 లక్షలు, 37 ప్రాథమికోన్నత పాఠశాలలకు 3.70 లక్షలు, 111 ఉన్నత పాఠశాలలకు 11.10 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 479 పాఠశాలలకు 31.40లక్షలు అందించింది. క్రీడా నిధులతో 37,166 మందికి ప్రయోజనం కలుగనున్నది.
పెద్దపల్లి జిల్లాకు 35.55లక్షలు
జిల్లాలో 337 ప్రాథమిక పాఠశాలలకు 16.85 లక్షలు, 83 ప్రాథమికోన్నత పాఠశాలలకు 8.30 లక్షలు, 104 ఉన్నత పాఠశాలలకు 10.40 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 524 పాఠశాలలకు 35.55 లక్షలు అందించింది. క్రీడా నిధులతో వేలా ది మందికి ప్రయోజనం కలుగనున్నది.
క్రీడలకు పూర్వవైభవం వస్తుంది..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాఠశాలల్లో క్రీడలకు పూర్వవైభవం వస్తుందన్న నమ్మకం ఏర్పడింది. విద్యార్థి దశలో క్రీడలు ఎంతో కీలకమైనవి. అయితే నిధుల కేటాయింపు లేక ఇన్నాళ్లూ క్రీడలు కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కరోనా సైతం క్రీడల నిర్వహణపై ప్రభావం చూపింది. చాలా మంది ఔత్సాహికులు క్రీడల్లో పాల్గొనకుండానే పాఠశాల విద్యను పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు నిధులను కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ నిధులతో క్రీడా సామగ్రి కొనుగోలు చేయిస్తున్నాం. స్కూళ్లలో పీఈటీలు ప్రత్యేక చొరవ తీసుకొని క్రీడాకారులకు మంచి తర్ఫీదును అందజేయాలని ఆదేశించాం. పీఈటీలు, పీడీలు లేని పాఠశాలల్లో హెచ్ఎంలు చొరవ తీసుకొని టీచర్లకు బాధ్యతలు అప్పగించాలని సూచించాం.
– బీ జగన్మోహన్రావు, డీఈవో (జగిత్యాల)
క్రీడాకారులుగా తీర్చిదిద్దే అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం శుభసూచకం. విద్యాహక్కు చట్టం కంటే ముందు పాఠశాలల్లో క్రీడల పరిస్థితి మెరుగ్గా ఉండేది. ఎప్పుడైతే చట్టం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి క్రీడలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే, పీఈటీలు పీడీలు సాధారణ తరగతి గదులు చెప్పుకునే పరిస్థితి తయారైంది. ఇది చాలా బాధను కలిగించింది. అయితే ప్రభుత్వం క్రీడల నిర్వహణకు ప్రైమరీ స్కూల్కి 5వేలు, యూపీఎస్, హెచ్ఎస్లకు 10వేల చొప్పున నిధులు ఇవ్వడంతో క్రీడా సామగ్రి కొనుగోలుతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించుకునేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వం ఇలాగే ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లు క్రీడాకారులను తయారు చేసే కార్ఖానాలుగా మారిపోతాయి. ఎంతో మంది క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది.
– పడాల కృష్ణ ప్రసాద్, పీడీ (వర్షకొండ)
సంతోషంగా ఉంది
చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్లో పాల్గొనేదాన్ని. అయితే రానురాను ఆటవస్తువులు చెడిపోయాయి. కొత్తవి రాలేదు. చాలా సార్లు పీఈటీ సార్ను అడిగాం. అయితే నిధులు లేవని చెప్పడంతో బాధపడ్డాం. అయితే బడిలోకి కొత్త ఆటవస్తువులు వస్తున్నాయని సార్ అంటే సంతోషం కలిగింది. ప్రభుత్వం నిధులు ఇచ్చిందని వాటితో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కొని తెచ్చారు. చాలా సంతోషంగా ఉంది.
– టీ గంగోత్రి, పదో తరగతి, ఖోఖో క్రీడాకారిణి
సర్కార్కు థాంక్స్
బడుల్లో ఆట వస్తువులు కొనేందుకు నిధులిచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. చాలా రోజులుగా స్కూళ్లో ఆటల్లేవు. క్రీడా సామగ్రి సైతం అందుబాటులో లేదు. చాలా బాధగా ఉండేది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆటలు ఆడుకోవాలన్న మాటలు మా సార్లు చెబుతున్నారు. మా స్కూల్కు రూ.10వేలు పంపించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– సిద్దు, పదో తరగతి విద్యార్థి, అథ్లెటిక్స్, ఖోఖో ప్లేయర్