జగిత్యాల : రాముడి (Sriram) పేరు చెప్పి ఓట్లు అడగడం కంటే ఆయన ఆలోచన విధానాన్ని జీవితంలో పాటించాలని బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా అభిప్రాయం గౌరవించడంలో రాముడు ఆదర్శప్రాయుడని, మోదీ (Narendra Modi) ని రాముడితో పోల్చడం సిగ్గుచేటని అన్నారు.
విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనం తీసుకువచ్చి ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షలు నిరుపేదల ఖాతాలో వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ (BJP) విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాలలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించడం సరైన పద్దతి కాదని అన్నారు. సమాజంలోని నిరుపేద వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు చేపట్టి విజయ సంకల్ప యాత్ర చేపడితే బాగుండేనని పేర్కొన్నారు. అధికారం కోసం దేశాన్ని పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని సరిహద్దుల్లో కనీస మద్దతు ధర అమలు చేయాలని ధర్నా చేస్తే స్పందించడం లేదని ఆరోపించారు. మూతబడిన ఫ్యాక్టరీలు పునః ప్రారంభించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలని సూచించారు. బీజేపీకి రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రూ. 400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1,200 చేశారని ఆరోపించారు.