మెట్పల్లి : కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) ప్రజలకు పిలుపు నిచ్చారు. శనివారం మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు( Vidya Sagar rao), బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్(Sanjay) తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఒక్క రైల్వే (Railway)శాఖలోనే 3.5 లక్షలు, రక్షణశాఖలో 3.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేంద్రం భర్తీ చేయడం లేదని ఆరోపించారు.
బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి యువతను రెచ్బగొడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు ప్రతిసారి ప్రతి ఒక్కరిని మోసం చేయలేరని, కొన్ని సార్లే కొందరిని మోసం చేయగలరని అన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం 2. 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ పార్టీకి ఉద్యోగాలు ఇవ్వచేతకాదని, ఇచ్చినోళ్లను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
వాట్సప్ లో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఉద్యోగాల నియామకాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు ఢిల్లీ, ముంబాయ్, చెన్నై వంటి నగరాలను కాదని హైదరాబాద్ (Hyderabad) కు వస్తున్నాయని, గత పదేళ్లలో హైదరాబాద్ కు 22 వేల కంపెనీలు వచ్చాయని తెలియజేశారు. కష్టమున్నా నష్టమున్నా ప్రజలతోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, ఉంటూనే ఉంటుందని పేర్కొన్నారు.
బీజేపీ చెప్పే మాటలకు చేతలకు సంబంధం ఉండదు
బీజేపీ చెప్పే మాటలకు చేతలకు సంబంధం ఉండదని, బీజేపీ మోసం చేసే పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా ధ్వజమెత్తారు. బీజేపీ చెబుతున్న సిద్ధాంతాలకు చేస్తున్న పనులకు కూడా సంబంధం లేదని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఆమోదించామని చెప్పుకుంటున్న బీజేపీ మహిళలకు కనీసం 10-15 శాతమైనా మహిళలకు టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.