న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్పై కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. యూఏపీఏ చట్టం 1967 కింద తల్హా సయీద్ను ఉగ్రవాదిగా పేర్కొంటూ శనివారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రస్తుతం తల్హా లష్కరే తొయిబాకు చెందిన మతగురువు విభాగానికి అధిపతిగా ఉన్నట్లు సమాచారం.
పాశ్చాత్య దేశాలు, ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జిహాద్ను వ్యాప్తి చేయడంలో నిమగ్నమైనట్లు పేర్కొంది. 46 సంవత్సరాల హఫీజ్ తల్హా సయీద్ భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునేందుకు లష్కరే తోయిబాలో ఉగ్రవాదులను నియమించడం, నిధుల సేకరణ, ప్రణాళిక, దాడుల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని హోంశాఖ పేర్కొంది. పాక్లోని వివిధ లష్కరే తోయిబా స్థావరాలను సైతం క్రమం తప్పకుండా సందర్శిస్తున్నాడని తెలిపింది.
భారత్, ఇజ్రాయెల్, అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నాడని పేర్కొంది. 2008లో ముంబై ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్కు పాక్ కోర్టు శుక్రవారం 33 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన మరుసటే రోజే కేంద్రం తల్హాను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 26 నవంబర్, 2008 ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.