తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా 34,045 మంది అభ్యర్థులకు 27,100 (79.60 శాతం) మంది హాజరయ్యారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించారు. అభ్యర్థులు రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకోగా బయోమెట్రిక్ విధానంతో లోనికి అనుమతించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఎగ్జామ్ సెంటర్లను పరిశీలించారు. కాగా, ఉదయం 10.15 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు.
కలెక్టరేట్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 34,045 మంది అభ్యర్థులకు 27,100 మంది హాజరయ్యారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించగా, సమయానికి రెండు గంటల ముందే అభ్యర్థులు వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. కొత్తగా బయోమెట్రిక్ విధానం ప్రారంభించడంతో పరీక్షకు గంటన్నర ముందు నుంచే అభ్యర్థులు వేలి ముద్రలు వేయడం కేంద్రాల్లో కనిపించింది. అలాగే, పది గంటల పదిహేను నిమిషాలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయడంతో కొంతమంది నిరాశతో వెనుదిరిగారు.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 16,824 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, 13,345 మంది పరీక్షకు హాజరయ్యారు. 3,479 మంది గైర్హాజరు కాగా, 79.32 హాజరు శాతంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాలు ఏర్పాటు చేసి, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కాగా కరీంనగర్ 22వ డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి గ్రూప్-1 పరీక్ష రాశారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6885 మంది అభ్యర్థులకు 5552 మంది (80.64 శాతం) పరీక్షకు హాజరు కాగా 1333 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ గుగులోత్ రవి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 6,067మంది విద్యార్థుల కోసం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 4,683మంది హాజరు కాగా 1, 384మంది గైర్హాజరయ్యారు. దీంతో 77.19 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సంగీత సత్యనారాయణ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4266మంది అభ్యర్థులకు 3,520మంది పరీక్షలు హాజరైనట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. 746 మంది గైర్హాజరయ్యారని, 82.51శాతం హాజరైనట్లు చెప్పారు.