జగిత్యాల, నవంబర్ 30: అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని కలెక్టర్ జీ రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్టీసీ డిపోలకు చెందిన సిబ్బందితో రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం వల్ల నిత్యజీవితంలో కేవలం ప్రమాదాలకు గురైన సమయంలో మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటు ఇతర వైద్య చికిత్స సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతామని పేర్కొన్నారు. రెడ్క్రాస్ సొసైటీ వారు కేవలం రక్తదాన కార్యక్రమాలు మాత్రమే కాకుండా, కరోనా కాలంలో అవసరమైన వారికి సరుకులు అందించడం, ఐసొలేషన్లు ఏర్పాటు చేయడంపై వారిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో సుమారు 85 శాతం మొదటి, 42 శాతం ప్రజలకు కరోనా వ్యాక్సిన్లు అందించామని, కరోనాపై ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని పేర్కొన్నారు. కరోనా మొదటి విడుతలో వహించిన జాగ్రత్తలను కొనసాగించాలని సూచించారు. వ్యాక్సిన్ నిర్వహణకు వైద్య, పంచాయతీరాజ్ శాఖ, ఇతర శాఖల్లోని కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారులు అహర్నిషలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, జగిత్యాల ఆర్టీసీ డీవీఎం నాగేశ్వర్, జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్, కోరుట్ల డిపో మేనేజర్ కృష్ణమోహన్, కమిటీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్ మద్యం దుకాణానికి లక్కీ డ్రా
సారంగాపూర్ మద్యం షాపు నిర్వహణకు మంగళవారం కలెక్టర్ జీ రవి లక్కీ డ్రా తీశారు. ఈనెల 20వ తేదీన 2021-23 సంవత్సరానికి జిల్లాలో 71 మద్యం షాపుల నిర్వహణకు డ్రా కార్యక్రమాన్ని నిర్వహించగా, సారంగాపూర్ మద్యం దుకాణానికి కేవలం 6 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ దుకాణానికి ఈనె ల 26 నుంచి 29వ తేదీ వరకు రీ నోటిఫికేషన్ జారీ చేసి, ఆశవాహుల నుంచి కొత్తగా 8 దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 14 వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఈ లక్కీ డ్రాలో కొండాపూర్ గ్రామానికి చెందిన సుదబోయిన లక్ష్మీగౌడ్ మద్యం దుకాణ నిర్వహణకు ఎంపికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, ఎక్సైజ్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.