జగిత్యాల కలెక్టరేట్, జనవరి 18: అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన రేగొండ నరేశ్ పలు రకాల వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు చేసేవాడు. అధిక శాతం వడ్డీ ఇస్తానంటూ పట్టణానికి చెందిన ప్రముఖులు, మహిళల వద్ద నగదు, నగలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దికాలం క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించడంతో నమ్మిన చాలా మంది నరేశ్కు పెద్దమొత్తంలో నగదు, బంగారు నగలు, బంగారం అప్పుగా ఇచ్చారు. ఇదే అదునుగా భావించిన అతడు తీసుకున్న అప్పును చెల్లించకుండా 2021 అక్టోబర్లో కుటుంబంతో సహా పారిపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్పీ సింధూశర్మ ఆదేశాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 16న పోలీసులకు పట్టుబడగా, విచారణ కోసం సారంగాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
మంగళవారం తెల్లవారుజామున పోలీసుల కండ్లుగప్పి పారిపోయాడు. జగిత్యాలలోని చిన్న కెనాల్ ప్రాంతంలో ఉన్నాడనే సమాచారం మేరకు అక్కడకు వెళ్లి బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 3.350 కి.గ్రా బంగారం, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో జగిత్యాల టౌన్ సీఐ కిశోర్, ఎస్ఐలు సంజీవ్, రహీం, ట్రాఫిక్ ఎస్ఐ లోకిని రాము, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు గంగాధర్, జీవన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.