జగిత్యాల కలెక్టరేట్/ కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 31: మూడేండ్లపాటు జిల్లా అభివృద్ధికి కృషిచేసి పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కలెక్టర్ జీ రవి మహబూబ్నగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. 2020 ఫిబ్రవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, కొవిడ్-19 విపత్తు సమయంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరుస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, లాక్డౌన్ సమయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజల మెప్పును పొందారు.
పచ్చదనం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ద చూపి ఆ వైపుగా అధికారులను పనిచేయించారు. స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ మిషన్-2022లో జగిత్యాల జిల్లా దేశంలోనే రెండో ర్యాంకును సాధించడంలో అలుపెరుగని కృషిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఆయన మహబూబ్నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు.
కరీంనగర్ కలెక్టర్కు పూర్తి అదనపు బాధ్యతలు..
జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ రవి బదిలీ కావడం, ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నెంబర్.159 ద్వారా మంగళవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు.