కరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధమతున్నది. మార్చిలోనే ఎన్నికలు ఉండే అవకాశముండగా, దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సీఈసీ సంకేతాలు ఇవ్వడం, ఓటరు జాబితా సవరణ చేపట్టిన నేపథ్యంలో పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించబోతున్నది. ఈ నెల 4న కరీంనగర్, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ల వారీగా దిశానిర్దేశం చేయనుండగా, మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించడంతోపాటు మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. నేటి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించబోతున్నది. నేడు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంతో సమావేశాలు ప్రారంభించి, ఈనెల 21తో ముగించనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లకు ఆయా లోక్సభ నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీచైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ ప్రతినిధులతోపాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకాబోతున్నారు. తెలంగాణభవన్ వేదికగా మొత్తం రెండు విడుతల్లో 16రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడురోజుల విరా మం తర్వాత తిరిగి 16 నుంచి 21 వరకు మిగిలిన నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో మొదలై హైదరాబాద్, సికింద్రాబాద్తో ముగుస్తాయి.
పటిష్ట కార్యాచరణ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమావేశాలు మొదటి విడుతలోనే ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ దక్కించుకోగా, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ సారి ఈ మూడు స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకుసాగుతున్నది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధిని మరోసారి కండ్లకు కట్టినట్లుగా వివరించడంతోపాటు పార్లమెంట్లో తెలంగాణ గొంతు విప్పాల్సిన ఆవశ్యకత, అందుకు కావాల్సిన బలం, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలవాల్సిన అవశ్యకతను నొక్కిచెప్పాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులున్నారు. దీంతోపాటు సన్నాహక సమావేశంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఒక పటిష్టమైన ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లో నిర్ణయించే అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల సంఘం సన్నద్ధం
కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఇప్పటికే ఓటరు జాబితా సవరణకు ఆదేశాలు జారీ చేసింది. 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించాలని ఇప్పటికే ఆదేశించింది. అంతేకాదు, ప్రతి 1500 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని స్పష్టం చేసింది. ఆ మేరకు అధికారులు రంగంలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే అన్ని రాజకీయ పార్టీలు సైతం లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే మూడు నియోజకవర్గాల్లో మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 50,18, 291 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 8న తుది జాబితా ప్రకా రం ఈ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో సుమారు 10 నుంచి 12వేలవరకు ఓటర్లు పెరుగుతారని అంచనా వేస్తున్నారు.