కాంగ్రెస్ రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నది. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆయన పర్యటించిన రోడ్డు పొడవునా అభివృద్ధి కనిపించలేదా..? నగరంలో నడిచిన రోడ్లను చూసినా తెలుస్తుంది. వీటిని విస్మరించి.. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలపై అసత్య ఆరోపణలు చేశారు. ప్రజలు వాస్తవాలు గమనించాలి. తెలంగాణను అభివృద్ధిలో ఆగ్రగామిగా నిలుపుతున్న బీఆర్ఎస్ కావాలో..? లేక తెలంగాణ వెనుక బాటు కారణమైన కాంగ్రెస్, బీజేపీ కావాలో..? ఆలోచించాలి. మాయమాటలు నమ్మితే మోసపోతం. గోసపడుతం.
– కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు రోజల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటించారని, ఈ సందర్భంగా ఆయన చెప్పినవన్నీ అసత్యాలే అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివారే తప్ప అందులో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అన్నది చూడలేదన్నారు. కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గతంతోపాటు తాజాగా ఆరోపించారని, నిజానికి ఈ పథకం కోసం 80వేల కోట్లు ఖర్చు అయిందని గతంలో మా ప్రభుత్వం అనేకసారి వివరించి చెప్పిందన్నారు. 80 వేల కోట్లు ఖర్చయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో రాహుల్గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని చెప్పడానికి ఇదో నిదర్శనమన్నారు. అలాగే ప్రాజెక్టులకు భూములు గుంజుకున్నారే తప్ప నీళ్లివడం లేదంటూ మరో ఆరోపణ చేశారని, ఆయన ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల పాటుగా తిరిగింది అంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వా రా నీళ్లొస్తున్న ప్రాంతమే అన్నారు. మంథని నుం చి ఆయన ప్రాజెక్టు వద్దకు వెళ్తే ఆ ప్రాజెక్టు ఎంత గొప్పదో తెలిసేదని, అలాగే ఆయన పర్యటించిన ప్రతి ప్రాంతంలో కాళేశ్వరం నీళ్లు వచ్చాయా రా లేదా అని రైతులను అడిగితే తెలిసేదన్నారు. కానీ, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పడం ధర్మమా..? అని ప్రశ్నించారు. కరీంనగర్మీ సేవా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాహుల్గాంధీ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటల్లోనే..
ధరణి పోర్టల్తో రికార్డులన్నీ మార్చి నిరుపేదల భూములు కాజేశారంటూ మరో పచ్చి అబ్ధం చెప్పారు. యాభై ఏండ్లకుపైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, భూములకు సంబంధించిన ఒక్క రికార్డునైనా ఆధునీకరణ చేసిందా? అలా చేస్తే భూముల తగాదాలు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పాలి. ధరణి అనేది ఒక బృహత్తర పథకం. రైతుకు పూర్తి హక్కులు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ అవుతున్న రైతులను అడిగితే తెలుస్తుంది. లక్ష రుపాయల రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. ఈ దేశంలో రెండు సార్లు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అవునా కాదా..? చెప్పాలి. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎంత రుణమాఫీ చేశారో చెప్పాలి.
గత ఎన్నికల్లో రెండు లక్షల రుణమాఫీచేస్తామని చెప్పినా ప్రజలు కాంగ్రెస్నమ్మని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలలి. రైతుబంధు ద్వారా భూస్వాములు, ధనవంతులకే లాభం జరిగిందంటూ చెప్తున్న రాహుల్గాంధీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుబంధు వస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా..? రైతుబంధు లాంటి పథకాన్ని ఎక్కడైనా ప్రవేశపెట్టారా..? పోనీ ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా..? చెప్పాలి. తెలంగాణలో కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే లబ్ధి జరిగిందని అవగాహన లేకుండా మాట్లాడారు. కానీ, ఇదో పచ్చి అబద్ధం. తెలంగాణలోని ఏ గడపకు వెళ్లి అడిగినా.. ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారులు కనిపిస్తారు.
కర్ణాటక రాష్ట్రంలో ఈ యేడాది మేలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ, ఐదు నెలల్లోనే సదరు ఐదు హామీల్లో ఒక్కటైనా అమలుకు నోచుకుంటుందా చెప్పాలి. నాడు రోజుకు వ్యవసాయ రంగానికి ఏడు గంటల కరెంటు ఇస్తామని చెప్పి రెండు గంటలు మాత్రమే ఇచ్చింది వాస్తవం కాదా..? బెంగళూరులో కరెంటు కోతలు పెరిగి ఐటీ కంపెనీలు షిఫ్టులు పెట్టుకునే దుస్థితి ఏర్పడింది నిజం కాదా..? అలాగే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన కన్నడ కాంగ్రెస్, ఇప్పడు కరెంటు కోతలు పెడుతుంటే ఉచితం అవసరం లేదు మాకు కరెంటు బాగా ఇవ్వండి అంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నది వాస్తవం కాదా.
అన్నభాగ్య స్కీం కింద 10 కిలోల బియ్యం ఇస్తామని, అధికారంలోకి రాగానే బియ్యం స్టాక్ లేదని, బహిరంగ మార్కెట్ ధర కట్టిస్తామని చెప్పి ఐదు నెలలు తిరగకుండానే కేవలం రేషన్ దుకాణ ధర మాత్రమే కట్టిస్తామని మాటలు చెపుతున్నది వాస్తవం కాదా..? శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. డీజిల్ బస్సులు నిలిపివేయడమే కాదు, ఇప్పుడు వయసుల వారీగా ఫ్రీ అంటూ కొత్త మెలిక పెట్టడం లేదా..? అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటిలో మహిళకు 2వేలువేస్తామని చెప్పి ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేదు కదా..? డీగ్రీ పాసైన యవతకు నెలకు 3వేలు, డిప్లొమా పాసైన వారికి 1500 భృతి చెల్లిస్తామని చెప్పినా నేటికి అమలు చేయకుండా ఐదు నెలల్లోనే పథకాలను అధోగతి చేసింది నిజం కాదా..? నేను చెప్పింది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా.
నిజానికి జాతీయ పార్టీ అంటే ఒకే విధానం ఉండాలి. కానీ, కాంగ్రెస్ మాత్రం రంగులు మారుస్తున్నది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతుంటే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన మేనిఫెస్టో ప్రకటించి ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణలో 4వేలు పింఛన్ ఇస్తామని, మిజోరాంలో 2,500 ఇస్తామని చెబుతున్నది. తెలంగాణలో సిలిండర్ 500కు, మిజోరాంలో 750కి ఇస్తామని, ఇక్కడ 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని, అదే మధ్యప్రదేశ్లో 25 లక్షలు ఇస్తామని ప్రకటించింది. తెలంగాణలో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామని, అదే మధ్యప్రదేశ్లో మాత్రం 1500 ఇస్తామంటున్నది. ఎవరూ రాజకీయ రంగులు మారుస్తున్నారో వీటిని చూస్తేనే అర్థం అర్థమవుతున్నది.
తెలంగాణ విముక్తి కోసం జరిగిన ఉద్యమాల్లో వందలాది మంది బిడ్డల బలిదానాలకు కారణం కాంగ్రెస్ కాదా..? చెప్పాలి. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందెవరు? 1969 జరిగిన ఉద్యమ సయంలో 369 మందిని బలితీసుకున్నది కాంగ్రెస్సే. తెలంగాణ వెనుకబాటుకు కారణమైంది కూడా ఆ పార్టీనే. కేసీఆర్ నాయకత్వంలో 2001నుంచి ఉద్యమం ప్రారంభిస్తే అనేక సార్లు ఆశ పెట్టి, వందల మంది బలిదానాలకు కారణమైంది. 2005 జనవరిలో ఆనాటి కేంద్ర మంత్రి ప్రణబ్ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ వేసి అమలు చేయకుండా కాలయాపన చేసింది నిజం కాదా..? 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగితే.. అరెస్టు చేసి ముప్పు తిప్పులు పెట్టింది కాంగ్రెస్ కాదా..? దీనిపై యావత్ తెలంగాణ గర్జిస్తే.. భయపడి 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించి మళ్లీ రెండు రోజులకే మాట మార్చింది మీ పార్టీ కాదా..? దీని ద్వారా వందలాది మంది బిడ్డలు బలిగొన్నిది మీరు కాదా..? నిజంగా ముందుగానే తెలంగాణ ఇచ్చి ఉంటే.. ఇన్ని బలిదానాలు జరిగేవా..? చెప్పాలి. తెలంగాణ వెనుకబాటు, బలిదానాలకు కారణమై ఇప్పుడు ఆ బలిదానాల్లో ఒకరైన శ్రీకాంత్ పేరు తలుచుకుంటూ.. మొసలి కన్నీరు కారిస్తే తెలంగాణ ప్రజలెవ్వరూ కాంగ్రెస్ను నమ్మరు.