రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయింది. కొత్త వేరియంట్ జేఎన్-1 వ్యాప్తి నేపథ్యంలో పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా వైద్యశాల, వేములవాడ ఏరియా హాస్పిటల్లో పది బెడ్లతో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు కల్పించింది.
జిల్లా దవాఖానలో 80 మంది వైద్యులు ఉండగా ఇందులోని 10 మంది వైద్యులను కొవిడ్ చికిత్స కోసం కేటాయించారు. దవాఖానకు వచ్చే రోగుల కోసం శానిటైజర్ బాటిళ్లను ఏర్పాటు చేశారు. కావాల్సిన మందులను అందుబాటులో ఉంచారు. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నది. 2020, 21 సంవత్సరాల్లో కొవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై వైద్యసిబ్బందికి సూచనలిస్తున్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని నిర్దేశిస్తున్నారు.
కొవిడ్ కట్టడికి వైద్యారోగ్యశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల సంఖ్య, అందులోని బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఉన్న సౌకర్యాల వివరాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వైద్యశాలలకు వచ్చే రోగులకున్న వ్యాధుల లక్షణాలను బట్టి కొవిడ్ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాజిటివ్ బాధితులను దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్లను సిద్ధం చేస్తున్నారు.