ఏప్రిల్ 14 : సెలవు రోజు కావడంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. వీరు ముగ్గురూ 15 ఏండ్లలోపు వారు కావడం, ఎవరికీ ఈత రాకపోవడంతో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
మార్చి 7 : హోలీ పండుగ కావడంతో తోటి స్నేహితులతో ఆనందంగా వేడుక జరుపుకున్న ముగ్గురు విద్యార్థులు స్నానం కోసం కరీంనగర్ శివారులోని వాగులోని ఓ గుంతలో దిగారు. వీరు కూడా 15 ఏండ్లలోపు వారు కావడం, ఎవరికీ ఈత రాకపోవడంతో గుంతలోనే మునిగి మృత్యువాతపడ్డారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలు కేవలం నెలన్నర వ్యవధిలోనే కాగా, రెండూ సెలవు రోజుల్లో జరిగినవే. ఈ ఘటనల్లో చిన్నారులందరూ 15 ఏండ్ల లోపు వారు కావడం, సరదా కోసం వెళ్లడం, ఎవరికీ ఈత రాకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, వీరితో పెద్దవాళ్లు ఎవరూ లేకపోవడంతోనే ఇంత ఘోరం జరిగింది. ఫలితంగా అందరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నారులూ.. సరదాగా చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, బావుల్లో ఈతకు వెళ్లాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రులూ.. వారిని ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత మీదే.
జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 19 : ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్నారు. ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, ఈత నేర్చుకోవడానికి మరి కొందరు, సరదాగా గడిపేందుకు ఇంకొందరు.. నీళ్లలో దూకి తమ ఈత ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తర్వాతనైతే విద్యార్థుల ఆటపాటల్లో ఈత ఓ భాగమైపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈత విహారం విషాదానికి దారితీస్తున్నది. వినోదాన్ని పంచిన ఆ నీరే.. చీకట్లోకి నెట్టివేస్తున్నది. నీటిలో చేపపిల్లలా ఈదుతూ గెంతులేసిన పిల్లలు.. అదే నీటిపై విగత జీవులుగా తేలియాడాల్సి వస్తున్నది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లితండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. నీటి విషయంలో అవగాహన లేకపోవడం, తోటి వారు ఈత కొడుతుండగా ఉత్సాహాన్ని ఆపుకోలేక, ఈత రాకున్నా నీటిలోకి దిగడం, ప్రవాహ నీటిలో ఈత కొట్టడం, చెరువులు, బావులు, కాలువల్లో ఈత పేరుతో ప్రయోగాలు చేయడం, చేపలు పట్టేందుకు పెట్టిన వైర్లకు తగిలి విద్యుత్ షాక్కు గురికావడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, యువకులు జలాశయాలు, కాలువల్లో ఈతకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి. ఈత కొట్టే సమయంలో పెద్దలు వెంట ఉండాలి. ఈత రాని పిల్లలను ఒంటరిగా చెరువులు, బావులు, జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడాలి. తల్లిదండ్రులు, పెద్దలు, నిపుణుల సమక్షంలోనే ఈత నేర్చుకునేలా చూడాలి. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో జలాశయాలు, కాలువల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి. నీటి ప్రమాదాలు జరుగకుండా పోలీసు శాఖ ద్వారా చర్యలు తీసుకుంటాం.
– జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్
ఎవరైనా నీటిలో మునిగిన సమయాల్లో ఒడ్డున ఉన్న వారు గమనిస్తే వెంటనే వారిని ఒడ్డుకు చేర్చి శ్వాస ప్రక్రియను గమనించాలి. బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే నోటిలోంచి గాలిని పంపించే ఏర్పాట్లు చేయాలి. చాతిపై రెండు చేతులతో ఒత్తిడి చేస్తూ శ్వాసక్రియ సరిగ్గా జరిగేలా చూడాలి. నీళ్లు మింగితే వెల్లకిలా పడుకోబెట్టి పొట్టను నెమ్మదిగా ఒత్తిపడుతూ నీటిని నోటి ద్వారా బయటకు వెళ్లేలా చేయాలి. నీళ్లు కక్కించిన తర్వాత బాధితుడిని కుడివైపు తిప్పి పడుకోబెట్టాలి. శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలించాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడితే, స్పృహలో లేకున్నా వెంటనే సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందేలా చూడాలి.
– డాక్టర్ మల్లారెడ్డి, ఎండీ