కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 24 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిర్ణయించిన తేదీల వారీగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారని, సకాలంలో హాజరు కావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచడంతో పాటు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళాశాలల్లో హాల్ టికెట్ తీసుకోలేని విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

ఒత్తిడి లేకుండా రాయండి.. విజయం సాధించండి
ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరంతా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాయాలి. మంచి విజయాన్ని సాధించాలి. మీ శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా లభిస్తుంది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. ప్రశాంత వాతావరణం కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలి.
– ఇంటర్ విద్యార్థులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషెస్