చిగురుమామిడి, మార్చి 16 : కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో వరి పొలాలను సోమవారం పరిశీలించారు. వరి పంట పీలక దశలో మోగి పురుగు కొంత అగ్గి ఆశించినట్లు పేర్కొన్నారు. మోగి పురుగు నివారణకు రెండు గ్రాముల కార్తప్ హైడ్రోక్లోరైడ్, ఐసోసైక్లోసిరం మందును ఒక లీటర్ నీటికీ కలిపి పిచికారి చేయాలని సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వారిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలంగా ఉన్నందున వాటి నివారణకు సరైన మందులు వాడాలని సూచించారు. చివరి దఫా ఎరువులు చల్లుకునేటప్పుడు యూరియాతోపాటు ఎకరానికి 30 కిలోల పొటాష్ వేయాలని, అదేవిధంగా కొన్నిచోట్ల ఆకులపై తుప్పురంగు మచ్చలు ఏర్పడి ఎదుగుదల లోపించినప్పుడు జింకు పోషక లోపంగా గుర్తించి లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున వారం రోజులు రెండుసార్లు పిచ్చికారి చేసుకోవాలని సూచించారు. వీరి వెంట కేవీకే శాస్త్రవేత్త విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అంజలి, రైతులు ఉన్నారు.