ఇక్కడ బెడ్పై కనిపిస్తున్న మహిళ పేరు గుజ్జుల సుమతి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేటకు చెందిన ఈమె ఐదేళ్ల నుంచి మోకాలు నొప్పితో బాధ పడుతున్నది. నొప్పి తగ్గేందుకు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లినా నయం కాలేదు. మోకాలు కీలు అరిగి పోయిందని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన సుమతికి ప్రైవేటుకు వెళ్లి రూ.లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదు. దీంతో చివరగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవఖానకు వెళ్లగానే, వైద్యులు పరీక్షించి, వారం రోజుల కిందట మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇక్కడ బెడ్పై కనిపిస్తున్న వృద్ధుడి పేరు పొనగంటి రాజలింగం. జమ్మికుంట మండలానికి చెందిన ఇతను కొన్నాళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఇటీవలే కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వచ్చాడు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో వైద్యులు ఎక్స్రే తీసి, మోకాలు కీలు అరిగిందని గుర్తించారు. వారం రోజుల క్రితం కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు నారగోని కుమార్గౌడ్, డాక్టర్ ధన్రాజ్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఆదిత్య, అనస్తీషియా డాక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
సర్కారు దవాఖాన పేదలకు అపర సంజీవనిలా మారింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తూ భరోసానిస్తున్నది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి, సదుపాయాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం కల్పిస్తున్నది. తుంటి, మోకాలు కీలు మార్పిడి వంటి అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రాణాలను కాపాడుతున్నది. అందుకు కరీంనగర్ ప్రభుత్వ దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది. గతంలో అన్ని విభాగాల్లో నెలకు 30 నుంచి 40 శస్త్ర చికిత్సలు కూడా జరగని పరిస్థితి నుంచి, ఇప్పుడు రోజుకు పదుల సంఖ్యలో ఆపరేషన్లు చేస్తున్న తీరు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెంచుతున్నది.
కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 19 : స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుండడంతో సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. దీనికి తోడు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రతి దవాఖానలో రూ.కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుతోంది. 2014కు ముందు ప్రభుత్వ దవాఖాన అంటేనే జనం హడలి పోయే పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల తీరే మారిపోయింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం సంచలనాలు సృష్టిస్తోంది. కరీంనగర్ ఎంసీహెచ్లో ఇప్పుడు ప్రతి నెలా 800 నుంచి 900 కాన్పులు జరుగుతున్నాయి. ప్రతి నెలా వెయ్యి కాన్పులు లక్ష్యంగా వైద్యులు పని చేస్తున్నారు. కొవిడ్ వచ్చిన గర్భిణులకు కూడా ఇక్కడ కాన్పులు చేశారు. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 132 మంది కొవిడ్ వచ్చిన గర్భిణులకు కాన్పులు చేసిన ఘనత కరీంనగర్ ఎంసీహెచ్కు ఉంది. ఈ నెలలోనూ 8 కొవిడ్ కేసు గర్భిణులకు కాన్పులు చేసి వైద్యులు తమ సేవా నిరతిని చాటుకున్నారు. రోగాల బారినపడి ప్రైవేట్ దవాఖానాల్లో శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న పేదలు ఎందరో అప్పుల పాలవుతున్నారు. ఇప్పుడు అన్ని రకాల శస్త్ర చికిత్సలు కరీంనగర్ వంటి పెద్ద దవాఖానలోనే లభిస్తుండడంతో ఇటు వైపు చూస్తున్నారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్లపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఈ విభాగానికి రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నది. దీంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
నడవ లేని స్థితిలో ప్రభుత్వ దవాఖానాకు వస్తున్న పేదలను పరీక్షించి, ఆవసరమైన వారికి తొంటి మార్పిడి ఆపరేషన్లతో పాటు మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. ఇప్పటికే 10 తొంటి, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేశాం. ఇక నుంచి ఇలాంటి ఆపరేషన్లు ఎన్నో చేయబోతున్నాం. త్వరలో నీ రీప్లెస్మెంట్ ఆపరేషన్లు కూడా చేస్తాం. గతంలో ఇలాంటి కేసులకు వరంగల్, హైదరాబాద్లోనే శస్త్ర చికిత్సలు జరిగేవి. ఇపుడు కరీంనగర్ దవాఖానాలో కూడా ప్రభుత్వం అన్ని రకాల ఎక్విప్మెంట్స్ సమకూర్చింది. దీంతో ఇక్కడ కూడా ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేయగలుగుతున్నాం. ఇలాంటి అవకాశాన్ని
– డాక్టర్ నారగోని కుమార్గౌడ్, ఆర్థోపెడిక్ హెచ్వోడీ
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణతో ఆరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. ఒకప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు మాత్రమే చేయగలిగిన మేము ప్రభుత్వం కల్పించిన మెరుగైన మౌలిక సదుపాయాల కారణంగా ఖరీదైన ఆపరేషన్లు చేయగలుగుతున్నాం. తొంటి మార్పిడి ఆపరేషన్లతో పాటు మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. ఇలాంటి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నిరుపేద రోగులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రత్నమాల, సూపరింటెండెంట్