ఉద్యమ సమయంలోనే కాదు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం గులాబీ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నది. సందర్భమేదైనా.. ఎన్నిక ఏదైనా మద్దతు ప్రకటిస్తున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారుకే జై కొట్టింది. మెజార్టీ సీట్లు కట్ట బెట్టి.. ఆశీర్వదించింది. అయితే, ఆ రెండు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువబోరంటూ జోరుగా ప్రచారం సాగింది.
కానీ, ఓట్ల లెక్కింపు తర్వాత చూస్తే ఒకటీ రెండు మినహా మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రచారం జరుగుతుండగా, కౌంటింగ్ తర్వాత మళ్లీ మెజార్టీ సీట్లు కారు ఖాతాలోకి చేరుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో గులాబీ పార్టీ అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి. రేపటి కౌంటింగ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
– కరీంనగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల దాకా భారీ మెజార్టీని అందిస్తూ.. కారు వెంటే నడుస్తున్నది. నిజానికి ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ గులాబీ అభ్యర్థులు గెలువరంటూ జోరుగా ప్రచారం సాగినా.. తీరా కౌంటింగ్ అయ్యాక చూస్తే మాత్రం రిజల్ట్ భిన్నంగా ఉంటున్నది. స్వరాష్ట్రంలో జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలే అందుకు నిలువెత్తు నిదర్శనం కాగా, వార్ వన్సైడ్ అయింది. 2014 ఎన్నికలతో పోలిస్తే 2018 ఎన్నికల నాటికి మూడు శాతం ఓట్లు అధికంగా పెరిగాయి.
ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2014లో 12 స్థానాల్లో ఘన విజయం సాధించగా, అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్కు మొత్తం 9,88,871(48.40 శాతం) ఓట్లు వచ్చాయి. అదే 2018లో 11,41,618 (51.47 శాతం) ఓట్లు వచ్చాయి. 2014తో పోలిస్తే అదనంగా 1,52,747 ఓట్లు పెరిగాయి. 2018 ఎన్నికల్లో మంథని, రామగుండం స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. నిజానికి ఇక్కడ ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ఉంటే ఇంకా ఆ ఎన్నికల్లో ఓట్లు పెరిగి ఉండేవి. 2018 ఎన్నికల్లో రెండు చోట్ల అభ్యర్థులు ఓడిపోయినా ఓటింగ్ శాతం పెరిగింది.
అంటే ప్రతి ఎన్నికకూ ప్రజలు బీఆర్ఎస్కు మద్దతును పెంచుతున్నట్లుగా కనిపించింది. అంతేకాదు, ఉమ్మడి జిల్లా చరిత్రలో చూస్తే.. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఒక పార్టీ గతంలో 47 శాతం మించి ఓట్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం 2018 ఎన్నికల్లో 51.47 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 22,17,710 ఓట్లు పోలు కాగా, అందులో బీఆర్ఎస్కు 11,41,618, కాంగ్రెస్-ప్రజా కూటమికి 7,02,803, బీజేపీకి 1,40,708 ఓట్లు వచ్చాయి. అలాగే, 13 నియోజకవర్గాల్లో కలిపి ఇతరులకు 2,32,581 ఓట్లు పడ్డాయి.
ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఇటు అధికారపక్షం, అటు ప్రతిపక్ష నాయకుల్లోనూ టెన్షన్ టెన్షన్ నెలకొన్నది. ప్రతిపక్ష అభ్యర్థులు తమ శ్రేణుల ద్వారా గెలుపోటములకు సంబంధించి అంచనాలు వేసుకుంటున్నా.. వారిలో నమ్మకం కుదరడం లేదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అందుకు 2014, 2018 ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా ఒక కారణంగా తెలుస్తున్నది.
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 2,72,754 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలో నిలిచింది. మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అలాగే, 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 1,40,708 ఓట్లు వచ్చాయి. అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపించింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 51.47 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్కు అది కూడా అన్ని పార్టీలు కలసి ప్రజాకూటమిగా ఏర్పడితే 31.69 శాతం ఓట్లు వచ్చాయి.
ఆనాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజాకూటమిగా జత కట్టినప్పుటికీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కంటే 4,38,815 ఓట్లు అధికంగా బీఆర్ఎస్కు వచ్చాయి. ఈసారి కూడా అదే ఫలితాలు వస్తాయా..? అన్న టెన్షన్ మాత్రం ప్రతిపక్షాల్లో కనిపిస్తున్నది. దీంతోపాటు ఈసారి ఎన్నికల్లో నిశ్శబ్ద ఓటు బాగా జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు ఓటర్ నాడి అంతుచిక్కకుండా ఉన్నది. దీంతో అన్నిపార్టీల అభ్యర్థుల్లోనూ టెన్షన్ టెన్షన్ నెలకొన్నది.
ఈసారి సైతం తమదే విజయమంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు. పైకి పలు రకాలుగా ప్రచారం జరుగుతున్నా.. 2014, 2018 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 58 ఏండ్ల సమైక్య పాలనలో జరుగని అభివృద్ధి, గడిచిన పదేళ్లలో జరిగిందని, ఇది కండ్ల ముందు ఉందని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఏ పాలకులు కూడా రైతుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగులా చేశారని, అందుకే రైతుల్లో మెజార్టీ ఓట్లు తమకే పడుతాయని ధీమాగా చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన పదకొండు విడుతల్లో 9.25 లక్షల మంది రైతులకు సర్కారు రైతుబంధు కింద సుమారు 8 వేల కోట్లు అందించిందని, మిషన్కాకతీయ కింద 900కు పైగా చెరువులను పునరుద్ధరించి 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చేసిందని, కాంగ్రెస్ హయాంలో మధ్యలో ఆగిపోయిన మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేసి వాటర్ హబ్గా మార్చిందని, వరద కాలువను రిజర్వాయర్గా చేసిందని, కాళేశ్వరం జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసిందని, 24 గంటల కరెంటు ఇస్తున్నదని గుర్తు చేస్తున్నారు. 2014లో కేవలం 3.83 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైతే.. ఆ విస్తీర్ణం 12.35 లక్షలకు పెరిగిందని, ఆనాడు 13.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ఇప్పుడు 28.60 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని, నాడు వ్యవసాయం దినదిన గండంగా 4.57 లక్షల మంది రైతులు సాగు చేస్తే ఈనాడు ఆ సంఖ్య 9.25,343 మందికి చేరిందని వివరిస్తున్నారు.
అనేక పథకాల ఫలితాలు రైతులకు అందాయని, ఆ కారణంగానే అన్నదాతల మెజార్టీ ఓట్లు తమకే పడుతాయన్న నమ్మకం తమకు ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు చెబుతున్నారు. ఇవేకాకుండా సంక్షేమ పథకాలు, విద్యా పథకాలు, మహిళల కోసం అమలు చేస్తున్న స్కీంలు వంటివి కూడా బీఆర్ఎస్కు కలిసి వస్తాయని చెప్పడంతోపాటు తమ విజయం తథ్యమని బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.