Godavarikhani | కోల్ సిటీ, మే 29 : గోదావరిఖని మార్కండేయ కాలనీ పరిధి టీచర్స్ కాలనీలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు. తొలగింపు ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభించాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం నగర పాలక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలను ఆయన సందర్శించారు. వర్షకాలం సమీపించకముందే అంతరాయం కలగకుండా వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
డీ.ఎం.ఎఫ్. టి నిధులు రూ.4 కోట్లలో భాగంగా ప్రతిపాదించిన ఈ కాలువ నిర్మాణం త్వరితగతిన పూర్తయితే వర్షాకాలంలో వరద ముంపు ఉండదన్నారు. వెంటనే కాలువపై వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు వడ్లూరి రవి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, బాలసాని తిరుపతి, టీపీఎస్ నవీన్, ఏఈ తేజస్విని తదితరులు ఉన్నారు.