ఆ ఊరికి వెళ్తే చుట్టూ ఇసుక డంపులే దర్శనమిస్తాయి.. నాలుగు దిక్కులా పెద్ద పెద్ద కుప్పలే కనిపిస్తాయి.. కానీ, రాత్రయితే మాత్రం అవన్నీ తరలిపోతాయి. కథలాపూర్ మండలం బొమ్మెన శివారులో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. పొద్దంతా వాగు నుంచి ఇసుక తవ్వి ఊరు చుట్టూ నాలుగు చోట్ల కుప్పలు పోస్తున్నా.. రాత్రి వేళ అక్రమంగా తరలిపోతున్నది. కండ్లముందే దందా జరుగుతున్నా ఎవరూ కట్టడి చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కథలాపూర్, మార్చి 2 : కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామశివారు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పొద్దంతా ఇష్టారాజ్యంగా తవ్వి, ట్రాక్టర్లలో తీసుకువచ్చి ఊరికి నలుదిక్కులా కుప్పలు పోస్తున్నారు. తక్కళ్లపెల్లి రోడ్డు.. మోత్కురావుపేట రోడ్డు.. గంభీర్పూర్రోడ్డు.. దూలూరు రోడ్డులో కుప్పలు పోస్తూ, రాత్రి వేళల్లో ఆ ఇసుకను టిప్పర్లలో దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కమ్మర్పెల్లి ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్టు తెలిసింది. ఇసుక వ్యాపారులకు పలుకుబడి ఉండడంతో అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేవారు లేరని తెలుస్తున్నది.
అధికారులు తనిఖీలు వస్తారేమోనని తెలుసుకునేందుకు కొందరు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతంలో పొద్దంతా, రాత్రి వేళల్లో కాపు కాసి ఉంటునట్టు సమాచారం. వాగులో ఇసుకను తీస్తుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, దందాను అడ్డుకోవాలని అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్ఐ రవికిరణ్ వివరణ ఇస్తూ… ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని, తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తామని, వాహనాలు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.