రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ పూర్తిగా మారిపోయింది. కాళేశ్వరం జలాల రాకతో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నది. గోదావరి నిండుకుండలా మారడంతోపాటు వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. కాలంతో సంబంధం లేకుండా పుష్కలంగా జలాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా రైతులు, మత్స్యకారులతోపాటు ఎన్నో వర్గాలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. అందుకు గుడ్లూరి నాగరాజు బాతుల పెంపకమే ఒక ఉదాహరణ. ఇక్కడున్న అనువైన పరిస్థితులను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఆ యువకుడు, మానేరు నదీతీరం వెంట ఉపాధి పొందుతున్న తీరు ఎందరికో స్ఫూర్తినిస్తున్నది.
– పెద్దపల్లి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణను సస్యశ్యామలంగా మార్చింది. గోదావరి నిండుకుండలా మార్చడంతోపాటు వాగులు, వంకలకు జీవం పోసింది. ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటలకు జలకలను తెచ్చింది. ఫలితంగా నేడు ఎక్కడ చూసినా వరి సాగు పెరిగి పచ్చదనం కనిపిస్తున్నది. కాలంతో సంబంధం లేకుండా జలకళ కనిపిస్తుండడం భరోసానిస్తున్నది. రైతులు, మత్స్యకారులతోపాటు ఎన్నో వర్గాలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇక్కడున్న అనువైన పరిస్థితులను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా కందుకూరు మండల కేంద్రానికి చెందిన గుడ్లూరి నాగరాజు ఇటీవలే పెద్దపల్లి జిల్లాకు వచ్చాడు. కొన్నేండ్లుగా బాతుల పెంపకంతోనే జీవనోపాధి పొందుతున్న ఆ యువకుడు, 20 రోజుల క్రితం 30కి ఒకటి చొప్పున మూడు రోజుల వయస్సు ఉన్న 2వేల పిల్లలను కొనుగోలు చేశాడు. వాటిని సుల్తానాబాద్ మండలం మానేరు తీరానికి తీసుకువచ్చాడు. అక్కడే ఒక షెడ్డు వేసుకొని తన కుటుంబ సభ్యులతో ఉంటూ బాతులను పెంచుతున్నాడు.
20 రోజులుగా పిల్లలను మానేరు తీరంలో తిప్పుతూ పోషిస్తున్నాడు. బాతు గుడ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందని, ఒక్కో దాని ధర 5పైనే పలుకుతుందని చెబుతున్నాడు. గుడ్లను హోల్సేల్గా కేరళ మార్కెట్కు తరలిస్తుంటానని, రోజువారీగా రెండు వేల గుడ్లకు 10వేల ఆదాయం వస్తుందని, అంటే నెలకు 2.50లక్షల నుంచి 3లక్షల దాకా ఆదాయం ఉంటుందని చెబుతున్నాడు. అయితే తెలంగాణ ప్రాంతంలో బాతుల పెంపకంపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వీటితో మంచి లాభాలు ఉంటాయని అంటున్నాడు.
ఎదుగుదల ఇలా
సాధారణంగా బాతులు ఆరేండ్లకుపైగా జీవిస్తాయి. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తాయి. వీటి పెంపంకం కూడా సులువే. అయ్యే ఖర్చూ తక్కువే. మంచి లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా ఇవి నీటిలో ఉండే పురుగులను తింటాయి. దుంపలు, వరిలో పెరిగే కీటకాలను, చిన్న చిన్న చేపలను కూడా తీసుకుంటాయి. దీని వల్ల పంట నష్టం జరగకుండా ఉడడంలో సహాయపడుతాయి. కాస్త పెరిగిన తర్వాత వరి ధాన్యాన్ని కూడా తింటాయి. అప్పుడే అవి ఆరోగ్యంగా ఎదుగుతాయి. రోజుకు 150 గ్రాముల వరకు ఆహారం తీసుకుంటాయి. 40 వారాలలో 5కిలోలకుపైగా ఎదుగుతాయి. మరణాల శాతం కూడా తక్కువగానే ఉంటుంది. అనేక పోషక విలువలు ఉండడంతో మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈకలను విక్రయించవచ్చు.
గుడ్ల ఉత్పత్తి ఇలా
బాతులు పుట్టిన ఐదు నెలల తర్వాత గుడ్ల దశకు వస్తాయి. అప్పటి నుంచి ఐదేండ్లకుపైగా గుడ్లను పెడుతాయి. సంవత్సరానికి 300లకుపైగా ఉత్పత్తి చేస్తాయి. ఉదయం లేదా రాత్రి వేళల్లో మాత్రమే గుడ్లను పెడుతాయి. ఒక్కో గుడ్డు 65 నుంచి 70 గ్రాముల బరువు ఉంటుంది.