వీణవంక, జూలై 3: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరుగ్యారెంటీలు.. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితోపాటు ఇస్తామన్న తులం బంగారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను గోస పెడుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో విజయవంతంగా అమలు చేసిన పథకాలను నిలిపివేసిందని, ప్రజలకు మేలు చేసే ఆ పథకాలు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టి అయినా కొనసాగించాలని సూచించారు. రాజకీయాలు మాని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని హితవు పలికారు. కల్వల ప్రాజెక్ట్ను పునరుద్ధరిస్తే వేల ఎకరాలకు నీరంది రైతులు బాగుపడతారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఇసుక క్వారీల వల్ల లారీల రవాణాతో పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, కోర్కల్, మల్లారెడ్డిపల్లి, హిమ్మత్నగర్, కొండపాక గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంస మయ్యాయని మండిపడ్డారు. వాటిని బాగు చేయకుంటే లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో మానేరు ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి ఉన్నదని, ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇసుకను తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
రూ.30 కోట్లతో చేపట్టిన వీణవంక రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో రవి సుధాకర్, సర్పంచులు దాసారపు సరోజన, అందె శ్రీమతి, దూడపాక శ్రీవేణి, గజ్జెల మొగిలయ్య, తిరుపతిగౌడ్, మండల కుమార్, రామిడి సంపత్రెడ్డి, బావు సంపత్, గాజుల శంకర్, గెల్లు శ్రీనివాస్, నాయకులు కామిడి శ్రీనివాస్రెడ్డి, చింతల శ్యాంసుందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, సుధాకర్, యాసిన్, స్వామి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.