చిగురుమామిడి, నవంబర్ 4: స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు గడపగడపకూ సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ కొనియడారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడిందని, అన్ని వర్గాలు అనేక కష్టాలు అనుభవించాయని గుర్తు చేశారు.
నాటికి, నేటికి తేడాను గమనించాలని, అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పిదారి కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు తప్పవని, రైతులు కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట, గాగిరెడ్డిపల్లి, బోల్లోనిపల్లి, మకుటంపల్లి, గునుకులపల్లె, ఓగులాపూర్, ఇందుర్తి, లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలంటూ గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల సతీశ్కుమార్ మాట్లాడారు.
స్వపరిపాలనలో పల్లెలు వికసించేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలతో చిగురుమామిడి మండలాన్ని సస్యశ్యామలం చేశారని కొనియాడారు. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినవారు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఆయనవెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీహరి, ఎంపీపీ కొత్త వినీత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.