జమ్మికుంట గడ్డపై మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రభంజనం సృష్టించింది. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, ప్రదర్శనల నడుమ వేలాది మంది తరలిరాగా, మధ్యాహ్నం వరకే సభా స్థలి డిగ్రీ, పీజీ కాలేజీ మైదానం కిక్కిరిసిపోయింది. మొదటిసారిగా వచ్చిన మంత్రి కేటీఆర్కు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. దారి పొడవునా ర్యాలీలతో ఘనంగా స్వాగతించారు. ముఖ్యంగా రైతులు వందలాది ట్రాక్టర్లలో తరలివచ్చి జేజేలు పలికారు. అమాత్యుడు రామన్న సభా వేదికపైకి చేరుకొని తన ప్రసంగంతో ఊర్రూతలూగించగా, సభికులు ‘జై కేటీఆర్.. జైజై కేటీఆర్’ అంటూ నినదించారు. మాట్లాడుతున్నంత సేపూ చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడైన పాడి కౌశిక్రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నాడంటూ ప్రశంసించడంతో సభికులంతా హర్షించారు.
హుజూరాబాద్/ జమ్మికుంట జనవరి 31 : టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఏర్పాటు చేసిన తొలి సభకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. మొదటిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్కు నీరాజనం పలికారు. కమలాపూర్ నుంచి వందలాది వాహనాలు, బైక్లోతో ర్యాలీగా అమాత్యుడు రామన్నకు జమ్మికుంట పట్టణంలో అడుగడుగునా స్వాగతించారు. దారిపొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. కొత్తపల్లి నుంచి సభా ప్రాంగణం వరకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ మైదానంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు మంత్రి రాగా, అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ఒక్కసారిగా ‘జై కేటీఆర్.. జైజై కేటీఆర్’ అంటూ నినదించారు. జమ్మికుంటతోపాటు హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక మండలాల నుంచి 50వేల మందికిపైగా సభకు హాజరయ్యారు. ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లపై తరలి వచ్చారు.
డప్పు వాయిద్యాలు, నృత్యాలతో సందడి చేసుకుంటూ ఏ ఊరికావూరు ఫ్లెక్లీలు ప్రదర్శిస్తూ బహిరంగ సభకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే సభా ప్రాంగణానికి రావడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోగా, ఆ తర్వాత వచ్చిన వారంతా సభ స్థలి చుట్టూ నిల్చున్నారు. కాగా, గాయకుడు సాయిచంద్ తన ఆటాపాటలతో ప్రజలను ఉర్రూతలుగించగా, కళాకారులు నృత్యాలతో అలరించారు. పలు కార్యక్రమాల కారణంగా మంత్రి కేటీఆర్ సభకు రావడం కాస్త ఆలస్యమైనా ప్రజలు ఓపికతో వేచి ఉన్నారు. మంత్రి కేటీఆర్ 5.07 గంటల నుంచి 5.29 గంటలకు ప్రసంగించగా, ఆద్యంతం సభికులు ఆసక్తిగా విన్నారు. బండి సంజయ్, ఈటలపై పంచ్ డైలాగులు విసిరిన సమయంలో ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మహిళా రుణాల కోసం వంద కోట్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, హుజూరాబాద్లోని హైసూల్ గ్రౌండ్, జమ్మికుంటలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్ను మినీ స్టేడియంగా మార్చేందుకు 20 కోట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.
పాడికి ప్రశంసల జల్లు
బీఆర్ఎస్ శ్రేణులను ఒక్కతాటిపైకి తెచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతోపాటు సభకు విచ్చేసిన మిగతా ఇద్దరు మంత్రులు ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ మాట్లాడుతూ గెలిచిన ఈటల రాజేందర్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా దేశాన్ని ఉద్దరిస్తానని వెళ్లాడని, ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్, అతనికి తోడుగా నిలిచిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాత్రం జనంలో ఉన్నారని, వారు సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడైన పాడి కౌశిక్రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నాడని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ‘జై తెలంగాణ, జై పాడి కౌశిక్రెడ్డి’ అని నినదించారు.
ఉప ఎన్నికలో గెలిపిస్తే నిధుల వరద పారిస్తా అన్నవ్. హుజూరాబాద్ను ఉద్దరిస్తా అన్నవ్. అమిత్ షాను తీసుకువస్తా అన్నవ్. హుజూరాబాద్ను మార్చేస్త అన్నవ్. ఏదీ కనిపించట్లేదే? ఈటలా ఏమైంది? సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమంటున్నవు. అందరినీ అవకాశం ఇస్తే, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు తండ్రిలాంటి కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనవచ్చునా..? రాజకీయంగా వేరుపడినా.. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడుతున్నరు. ఇది మీకు తగునా..? పైనో ఇంజన్ ఉన్నది.
బండి సంజయ్ అనే ఇకడో ఇంజన్ ఉన్నది. ఇద్దరం కలిసి పొడిచేస్తం. అన్నవు కదా. ఇక్కడ ఎక్కడ పొడిచినట్లు కనపడతలేదు. మాటలు కోటలు దాట్తయ్.. చేతులు మాత్రం గడప దాటయ్. హుజూరాబాద్ లో ఇదివరకు జరగని అద్భుతాలన్నీ చేస్తామని చాలామాటలు చెప్పిన్రు. రూ.3వేల పెన్షన్ ఇస్తామన్నరు. నిధుల వరద పారిస్తామన్నరు. ఒక పైసా ఢిల్లీ నుంచి వచ్చిందా..? అని ఆలోచించాలని కోరుతున్న. మాటలు కోటలు దాటుతయ్. చేతలు మాత్రం కడప దాటయ్ . ఎన్నికలు బాగా నరికిన్రు.
2022 నాటికి ఇండ్లు లేని వారందరికీ భారత్లో ఇండ్లు ఇస్తం. రైతుల ఆదాయం డబుల్ చేస్త. ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిస్త. కరెంటు లేని ఊరు ఉండది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్త. ఇవన్నీ మోదీ చెప్పినా మాటలు కావా..? 2022 వరకు కల్లా భారతదేశాన్ని భూతలస్వర్గం చేస్త. అమెరికావాళ్లే వచ్చి లైన్ కట్టాలి వీసాల కోసం అని చెప్పిన మాట వాస్తం కాదా..? 2022 దాటి 2023 వచ్చింది మరి ఏమైంది? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ మోదీ దేవుడు అంటున్నడు. ఎవడికి దేవుడు? అయితే నీకు దీవుడేమో సీటిచ్చినందుకు. ఎవరికి దేవుడు ఈ దేశంలో మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. రూ.400 ఉన్నసిలిండర్ను రూ.1200 చేసినోడు దేవుడా? 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎనిమిదేళ్లలో యువతను మోసం చేసిందుకు యువతకు దేవుడా..? నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టే ప్రభుత్వం. కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం.
ఎన్ని మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన్రు. ప్రధాని మోదీ జన్ ధన్ ఖాతాలు తెరిస్తే.. ఖాతాల్లో రూ.15లక్షలు ధనాధన్ వేస్తానని చెప్పిండు. మరి హుజూరాబాద్లో, దేశంలో ఎవరికైనా వచ్చాయా..? అందరి డబ్బులు ఒకడి ఖాతాలో పడ్డయ్. ఆ ఒకడు ప్రపంచంలో కుబేరుడై కూసున్నడు. మంది సొమ్ము తిని దొంగ అదాని ఒకడే బాగుపడ్డాడు. ఇంకా ఎవరూ బాగుపడలే. దీన్ని బట్టి చూస్తే ఎవరి పాలన ఈ దేశానికి, రాష్ట్రానికి అరిష్టమో ప్రజలు ఆలోచన చేయాలి.
అమాత్యుడి పర్యటన ఇలా..
మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 10.15 గంటలకు కరీంనగర్లోని పోలీస్ స్పోర్ట్స్ సెంటర్కు హెలీకాప్టర్లో చేరుకున్నారు. 10.30 గంటలకు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్(కేసీఆర్)ను ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ హౌస్లో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. 11.15 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.00 గంటలకు కరీంనగర్ పోలీస్ స్పోర్ట్స్ సెంటర్కు చేరుకుని హెలీకాప్టర్ ద్వారా కమలాపూర్కు చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం 4.20 గంటలకు జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లికి చేరుకుని, అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో డిగ్రీ కళాశాల మైదానానికి వచ్చారు. 4.35 గంటలకు జమ్మికుంట సభా వేదికకు చేరుకున్నారు. సాయంత్రం 5.07 గంటలకు ప్రసంగం ప్రారంభించి 21 నిమిషాలపాటు మాట్లాడారు. 5.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హుజూరాబాద్ జూనియర్ కాలేజీలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.
బీఆర్ఎస్ కోసం సైనికుడిలా పనిచేస్త
మంత్రి కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న గొప్ప నాయకుడు. ఆయన ఒక్కసారి కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాలేదు. ఇప్పుడు జమ్మికుంట బహిరంగ సభకు వస్తున్నాడంటే నమ్మలేదు. ఎలాగైనా ఆయనను చూడాలని సభ ప్రారంభానికి 2 గంటల ముందే ప్రాంగణానికి చేరుకున్న. వేల మంది వచ్చిన్రు. ఇంత పెద్ద సభ్యను ఎన్నడూ చూడలె. కేటీఆర్ ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా విన్న. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ గడ్డమీద ఎగిరేది బీఆర్ఎస్ జెండానే. దాని కోసం ఒక సైనికుడిగా పనిచేస్త. కేటీఆర్ జమ్మికుంటకు రావడం లక్షల మంది ప్రజల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేస్త.
– రెడ్డిరాజుల రమేశ్, బీఆర్ఎస్ నాయకుడు (వీణవంక)