మల్యాల, ఫిబ్రవరి 13: కొండగట్టు క్షేత్రం కిటకిటలాడింది. ఎములాడ రాజన్నకు సమ్మక్క తొలి మొక్కు సమర్పించిన భక్తజనం, ఆ తర్వాత అంజన్న సన్నిధికి పోటెత్తింది. సోమవారం రాత్రే రాష్ట్ర నలుమూలల నుంచి బస్సులు, వాహనాల్లో ఆలయానికి వేలాదిగా చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అనుబంధ ఆలయాలైన లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి, భేతాళస్వామి, కోదండ రామాలయం, బొజ్జపోతన, మునిగుహలు, కొండల రాయుడి పాదుకలను దర్శించుకున్నారు. దొంగల మర్రి నుంచి ఆలయం దాకా మూడు కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ కనిపించింది. ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, పాలక మండలి చైర్మన్ తిరుక్కోవళూర్ మారుతీస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 30 వేలమంది భక్తులు దర్శించుకున్నారని, మొత్తం 20 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.