వేములవాడ టౌన్, నవంబర్ 7 : పరమశివుడు, దామోదరుడికి అత్యంతప్రీతికరమైన కార్తీక సోమవారం రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం కార్తీకశోభను సంతరించుకుంది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వేకువజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయపరిసరాలన్నీ కిటకిటలాడాయి. భక్తుల దీపారాధనతో ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. రాజన్నను దాదాపు 60 వేలకు పైగా దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి సుమారు 27 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.