కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 2 : కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉండగా, సస్యరక్షణ చర్యలతోనే పంటను కాపాడురోవచ్చని కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిద్ది శ్రీధర్, దేవ అనిల్ సూచిస్తున్నారు. పొట్టదశలోనే పురుగును గుర్తించి అరికట్టాలని చెబుతున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరికి తెగుళ్లు సోకే ప్రమాదమున్నది. తాటాకు తెగులు, కాండం తొలిచే పురుగు, ఉల్లి కోడు, సుడిదోమ, కంకినల్లి, తెగుళ్ల పరంగా బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు, అగ్గి తెగులు బారిన పడే అవకాశం ఉంది. గత పంటల అనుభవాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ, చీడపీడలను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపడితే నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిద్ది శ్రీధర్, దేవ అనిల్ సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేపట్టాల్సిన నివారణ చర్యల గురించి వివరించారు. తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి మాటల్లోనే..
తాటాకు తెగులు/ హిస్పా
శరీరంపై ముండ్లు కలిగి నలుపురంగులో ఉండే పెద్ద పురుగులు ఆకుల్లోని పత్రహరితాన్ని తినడం వల్ల ఆకు కొనలపై ఎండిన మచ్చలు ఏర్పడుతాయి. ప్రస్తుతం ఈ తెగులు వానకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
నివారణ: క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 400 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లికోడు
పిల్ల పురుగులు కాండాన్ని తొలిచి ఆంకురం వద్ద వృద్ధి చెందుతుంది. తర్వాత అంకురం లేత ఆకుపచ్చని పొడగాటి గొట్టంగా మార్పుచెంది బయటకు వస్తుంది. ఆలస్యంగా నాటిన పొలాల్లో ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ: ఉల్లి గొట్టాలు కనిపిస్త్తే కార్భొఫ్యూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా, ఫోరెట్ 10జీ గుళికలు ఎకరాకు 5కిలోలు వెదజల్లాలి.
బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు
వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉధృతి పెరుగుతుంది. తెగులు సోకిన ఆకులపై పసుపురంగు మచ్చలు ఏర్పడి దుబ్బుకు ఇరుపక్కలా ఆకులు ఎండి పోతాయి
నివారణ: అగ్రిమైసిన్ లేదా ప్లాంటామైసిన్ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో లేదా 30గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 10లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆకు తొడిమలో నల్లి వృద్ధి చెందడం వల్ల ముదురు గోదుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. నల్లి సోకిన కంకులలో గింజలు నల్లబడుతాయి. నివారణకు ఎకరానికి ప్రొపినోఫాస్ 400 మిల్లీమీటర్లు లేదా డైకోపాల్ లీటర్ ద్రావణాన్ని 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సుడిదోమ
తొలిదశలో గోధుమ రంగులో లేదా తెల్లవీపు దోమలు గుంపులుగా నీటి పై భాగాన దుబ్బులపై నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారతాయి. క్రమంగా సుడులుగా మారి ఎండిపోతాయి.
నివారణ: పొలాన్ని ఆడపదడపా ఆరబెడుతూ నత్రజని వినియోగాన్ని తగ్గించుకోవాలి. తొలి దశలో గమనిస్తే ఎసిఫేట్ 300 గ్రాములు, తర్వాత దశల్లో ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటెఫ్యూరాన్ 80గ్రాములు లేదా పైమెట్రోజైన్ 120గ్రాములు లేదా, ఇమిడాక్లోప్రిడ్, ఎథిప్రోల్ 50గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
కాండం తొలిచే పురుగు/ మొగిపురుగు :
పిలకలు తొడిగే దశలో ఈ పురుగు ఆశించిన మొవ్వులు ఎండి చనిపోతాయి. పూత దశ తర్వాత ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. చచ్చిన మొవ్వులు/కంకులు పీకితే తేలికగా బయటకు వస్తాయి.
నివారణ: ఆలస్యంగా వరి నాట్లు పడితే పైరుకు 30 రోజుల్లోపు ఎకరాకు కార్బొఫ్యూరాన్ 3జీ గుళికలు 10కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8కిలోల మిశ్రమాన్ని పొలంలో నీరు తగ్గించి చల్లాలి. లేదా క్లోరాంటోనిలీఫ్రోల్ 4కిలోలు చల్లాలి. ఇక రెక్కల పురుగు ఉధృతి గమనిస్తే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ను 50శాతం, ఎస్పీ 400 గ్రాములు లేదా క్లోరాంటోనీలిప్రోల్ 60 మిల్లీ లీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మానిపండు తెగులు
వరి పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. మొక్క పూతలో అప్పుడే ఏర్పడుతున్న విత్తనాల నుంచి పసుపు రంగు శిలీంధ్ర బీజ సముదాయాలు ఏర్పడుతాయి. క్రమేణా నలుపు రంగుకు మారుతాయి. దీని నివారణకు గాను ట్రైప్లాక్సిస్ట్రోబిన్ + టెబ్యూకొనజోల్ 80గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
అగ్గితెగులు:
ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే వెన్ను విరిగి వేలాడుతుంది. నివారణకు 120 గ్రాములు ట్రైసైక్లాజోల్ లేదా 300 మిల్లీలీటర్ల ఐసోప్రోథమోలీన్ ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.