రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద నగరంగా ఎదుగుతున్న కరీంనగర్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. నగరంతోపాటు జిల్లాకేంద్రానికి వచ్చే ఏ దారిలో చూసినా భూములకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. మౌలిక సదుపాయాలు, సుందరీకరణ, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఏర్పాటు, ఐటీ టవర్, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ఫ్రంట్, మెడికల్ కాలేజీ, శివారు గ్రామాలను తాకుతూ వెళ్లే జాతీయ రహదారులు, నిత్యం తాగునీటి సౌకర్యం, ప్రశాంత వాతావరణం, అద్దాల్లా మెరుస్తున్న ప్రధాన రహదారులు, స్మార్ట్సిటీ, సీఎం అస్యూరెన్స్ కింద అందంగా తయారవుతున్న రోడ్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రముఖ నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల ప్రజలు ఆసక్తి చూపుతుండగా, రియల్ హవా నడుస్తున్నది. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్న పలు రియల్ సంస్థలు తమ నిర్మాణాలు, వెంచర్లను కరీంనగర్ కేంద్రంగా విస్తరిస్తుండడం కనిపిస్తున్నది.
– కార్పొరేషన్, నవంబర్ 23
పర్యాటకంగా తీర్చిదిద్దే ప్రాజెక్టులు
కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు తేగా, అందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఎల్ఎండీ డ్యాం సమీపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఐటీ టవర్లో పలు కంపెనీలు కొలువుదీరాయి. మానేరు నదిపై రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కమాన్ చౌరస్తా నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ రోడ్డుకు సంబంధించి కేబుల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే జనవరిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు సిరిసిల్ల రోడ్డులో పద్మనగర్ వద్ద టీటీడీ ఆధ్వర్యంలో పదెకరాల్లో వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటితోపాటు నగరంలోని 14 చౌరస్తాలను ఆధ్మాత్మికంగా, చారిత్రాత్మకంగా, చరిత్రను తెలిపే విధంగా సుందరీకరణ పనులు మొదలయ్యాయి. అలాగే నగరం చుట్టూ రాబోయే జాతీయ రహదారులతో కరీంనగర్ ప్రముఖ నగరాల జాబితాలో చోటు దక్కించుకోనున్నది.
జీవన ప్రమాణాలు భేష్
కేంద్ర ప్రభుత్వం 2019లో దేశవ్యాప్తంగా ఐదు లక్షల జనాభా లోపు, పై జనాభా గల 111 పట్టణ, నగరాల్లో జీవన ప్రమాణాల సూచిక సర్వే నిర్వహించింది. నగరంలో పాలనా వ్యవహారం, పౌరులకు అందుతున్న సేవలు, ప్రజల గుర్తింపు, వారి జీవన విధానాలు, సంస్కృతులు, విద్యావిధానం, వైద్యం, పరిశుభ్రత, పారిశుధ్యం, భద్రత, రక్షణ, ఉద్యోగ కల్పన, నివాస స్థితిగతులు, విద్యుత్ సరఫరా, ట్రాన్స్పోర్ట్, వృథానీటి వినియోగం, కాలుష్య నివారణ ఇలా 79 అంశాలను పరిగణలోకి తీసుకున్నది. అదే ఏడాది ఆగస్టులో సర్వే వివరాలను ప్రకటించగా కరీంనగర్ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా పరిపాలనా విభాగంలో 3వ స్థానంలో ఉండగా.. భద్రత, కాలుష్య నివారణలో 4వ స్థానం, కచ్చితమైన నీటి సరఫరా విభాగంలో 8వ స్థానంలో నిలిచింది. మొత్తంగా అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చిన ర్యాంకులో 11వ స్థానం కైవసం చేసుకుంది. కాగా రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ నగరాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానం సాధించి కరీంనగర్ తన మార్కును నిలబెట్టుకున్నది.
వేగంగా కరీంనగర్ అభివృద్ధి
కరీంనగర్ రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలందరు కూడా నగరంలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే నగరంతోపాటు శివార్లలోని ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాల ప్లాట్లకు మంచి డిమాండ్ ఉన్నది. ప్రభుత్వ నిబంధనలతో ఉన్న ప్లాట్స్ విషయంలో ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. అలాగే కరీంనగర్కు వస్తున్న వివిధ ప్రాజెక్టులతోనూ కమర్షియల్ పరంగా కూడా భూములను కొనేందుకు ముందుకు వస్తున్నారు. రియల్ రంగానికి గతంలో కంటే ఇప్పుడు మంచి ఆదరణ ఉన్నది.
– దిలీప్కుమార్ మోట్వాని, రాయిచందని సింధ్ డెవలపర్స్
ఆధునిక సౌకర్యాలపై ప్రజల ఆసక్తి
మానేరు రివర్ ఫ్రంట్, మరోవైపు ఐటీ టవర్స్, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కరీంనగర్ దేశంలోనే మంచి గుర్తింపు పొందింది. ఇక్కడ రియల్ వ్యాపారం బాగున్నది. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మిస్తున్న ఇండ్ల విషయంలో ప్రజలు ఎక్కువగా ఆధునిక సౌకర్యాలను కోరుకుంటున్నారు. మారుతున్నకాలంలో వస్తున్న వివిధ ఐటీ సంబంధిత సౌకర్యాలు, డిజైన్లు ఎంచుకుంటున్నారు. కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరం అన్ని రంగాల్లోనూ బాగుండడంతో ప్రతి ఒక్కరూ నగరంవైపు చూస్తున్నారు.
– బూరుగు సత్యనారాయణగౌడ్, ఆదర్శ కంఫర్ట్స్
అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది
కరీంనగర్లో ఓ వైపు భారీగా మౌలిక సదుపాయాలు కల్పించారు. మరోవైపు సుందరంగా తీర్చిదిద్దారు. ఐటీ, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రాజెక్టులతో నగరం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. దీంతో ఇక్కడ ఉండేందుకు ప్రజలు, వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూములను కొనేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. గతంలో కంటే కూడా ఇటీవల భూములు, ఇండ్ల కొనుగోళ్లకు మంచి డిమాండ్ వచ్చింది.
– మద్దుల సుశాంత్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్స్
కరీంనగర్వైపు చూపు
కరీంనగరం సకల వసతులతో అభివృద్ధి చెందుతున్నది. రోడ్లు, ఇంటింటికీ తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనతో ప్రజానీకానికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నది. విద్య, వైద్య రంగాల్లో ఊహించని విధంగా డెవలప్మెంట్ కనిపిస్తున్నది. కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్లా మారింది. నగరాన్ని ఆనుకొని ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, మరోవైపు కొత్తగా మెడికల్ కళాశాల ఏర్పాటవుతున్నది. ఇలా అన్నింటా డెవలప్ అవుతుండడంతో ప్రతి ఒక్కరూ కరీంనగర్వైపు చూస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పూర్వ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయినా.. ప్రజలు ఎక్కువగా నగరంలోనే నివాసముండేందుకు ఇష్టపడుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలతోపాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో భూములు, ఇండ్లు కొనేందుకు ముందుకువస్తున్నారు.
నగరంలో నివసించేందుకు ఆసక్తి
కరీంనగర్ రాష్ట్రంలోనే రెండో నగరంగా ఎదుగుతున్నది. ఓ వైపు విద్యా, వైద్య రంగం ఇప్పటికే రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. మరోవైపు పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి నగరంలో ప్రజలు నివాసం ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తుండడంతో రియల్ రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అన్ని విధాలుగా విశాలంగా ఉండే స్థలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లను ప్రజలు కోరుకుంటున్నారు. ఇండ్లల్లో ఆధునిక పరిజ్ఞానంతో నడిచే యాంత్రీకరణ వస్తువులవైపు ఆసక్తి చూపుతున్నారు.
– రాహుల నరేశ్కుమార్, ఎస్ఆర్ కన్స్స్ట్రక్షన్స్
పుంజుకున్న రియల్రంగం
నగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఎటు చూసినా డెవలప్మెంట్ కనిపిస్తున్నది. జిల్లాకేంద్రానికి వచ్చే ఏ దారిలో చూసినా జోష్ కొనసాగుతున్నది. ప్రధానంగా జగిత్యాల రహదారిలో నగరానికి ఆనుకొని ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చుట్టుపక్క ల గ్రామాల్లో భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. కరీంనగర్లో జిల్లా యంత్రాంగం చేపట్టిన అంగారిక టౌన్ వెంచర్లకు వచ్చిన ఆదరణ చూస్తే.. రియల్ రంగం ఎంతలా పుంజుకున్నదో అర్థమవుతుంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రియల్ వ్యాపారానికి భారీగానే డిమాండ్ ఉన్నది. నగర శివార్లతోపాటు (సుడా) పరిధిలోని గ్రామాల్లోనూ పెద్దఎత్తున వెలుస్తున్న వెంచర్లవైపు ప్రజలు ఆసక్తి చూపడం కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ ఉన్న డిమాండ్ను చూసి కరీంనగర్లోని రియల్ వ్యాపారులతోపాటు హైదరాబాద్కు చెందిన పలు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా కరీంనగర్ శివార్లలో నూతన వెంచర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ రోడ్డుతోపాటు నగరానికి ఆనుకొని ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీవైపు మెడికల్ కళాశాల కూడా వస్తుండడంతో జగిత్యాల దారిలో భూములకు రెక్కలు వచ్చాయి. అలాగే రేకుర్తిలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, పద్మనగర్లో వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంతో ఈ ప్రాంతాల్లో కూడా భారీగా డిమాండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.