Sulthanabad | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 8: 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి 55 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందం మిన్నంటాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామానికి చెందిన గంట్ల నరసమ్మ-పెద్ద పాపయ్య దంపతులకు ఆరుగురు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకుగంట్ల కన్నయ్య గత 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం ఎంతో వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. 55 ఏళ్ల తర్వాత వెళ్లిపోయిన కన్నయ్య వస్తుండని సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్ కి వెళ్లి ఘనంగా స్వాగతం పలికారు.
ఇంటి నుంచి వెళ్లిన కన్నయ్య హర్యానాలో జీవనం సాగిస్తున్నాడు. కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి కన్నయ్యకు పరిచయం కావడంతో కన్నయ్య తన ఊరు తల్లిదండ్రుల వివరాలు తదితర సమాచారం, ఫోన్ నంబర్ ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి చిన్నకల్వలకు లెటర్ పంపించాడు. ఆ లెటర్లో కన్నయ్య ఫోన్ నెంబర్ తో పంపించాడు. గత వారం రోజుల క్రితం లెటర్ కుటుంబ సభ్యులకు ముట్టింది.
లెటర్ లో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి కన్నయ్య వివరాలు తెలుసుకున్నారు. ఇంటికి రావాలని బలవంతం చేయడంతో ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున పెద్దపల్లి రైల్లో దిగగా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పెద్ద సంఖ్యలో వెళ్లి ఘనంగా స్వాగతం పలికి ఇంటికి తీసుకువచ్చారు.