పెగడపల్లి, డిసెంబర్ 16 : ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దాదాపు రెండెకరాల్లో వరి వేశాడు. మిగతా 20 గుంటలలో పౌల్ట్రీఫాం నడిపిస్తున్నాడు. మరో 5 గుంటల్లో బంతి పూలు సాగు చేశాడు. గత అక్టోబర్లో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద ఉన్న నర్సరీలో 5కు ఒక మొక్క చొప్పున 2,500 ఎరుపు, పసుపు రంగు బంతి పూల మొక్కలను తీసుకొచ్చి నాటాడు.
మంచి యాజమాన్య పద్ధతులు పాటించాడు. మొక్కలు నాటిన 60 నుంచి 70 రోజులకు అంటే ప్రస్తుతం పూలు పూస్తుండడంతో రైతు చంద్రయ్య సంతోష పడుతున్నాడు. పంట నాణ్యంగా ఉందని, దిగుబడి కూడా బాగుందని ఆనందపడుతున్నాడు. ప్రస్తుతం మల్లన్న దేవుడి పట్నాల సీజన్ కావడంతో పంట చేను వద్దకే వచ్చి 100కు కిలో చొప్పున పూలు కొంటున్నారని చెబుతున్నాడు. 5 గుంటల్లో బంతి సాగుకు 15 వేల వరకు పెట్టుబడి పెట్టానని, ఇప్పటివరకు 20 వేల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు. మరో రెండు నెలల పాటు పంట దిగుబడి ఉంటుందని, 30 వేల వరకు ఆదాయం వస్తుందని వివరించాడు. వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ మొత్తంలో బంతి పూల సాగు చేస్తానని, ఇతర పంటల సాగు కన్నా ఆదాయం బాగున్నదని చెబుతున్నాడు.