Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 6 : చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత కుటుంబాలు బైపాస్ నుండి రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా బాధిత కుటుంబాలకు స్టేటస్ కో యథాస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మొదటి విడతగా హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి.
అందులో భాగంగా సుందరగిరిలో బాధితులు కందుకూరి లక్ష్మణ చారి, కక్కర్ల బాలయ్య, కెమ్మసాగరం వెంకటయ్య, ఓరుగంటి భారతీదేవి, వంతడుపుల మల్లయ్య, పిట్టల రమేష్, గైని శ్రీనివాస్, బో ల్లభత్తునీ రాజేశం, ములుగురి వెంకటాద్రి, వంతడుపుల వినయ్, సిలుమోజు యశోద మొదలైన 11 మంది దాఖలు చేసిన రెడ్ పిటిషన్ పై ఆగస్టు 4న విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరపల్లి నంద 11 మందికి చెందిన ఆస్తులపై ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు స్టేటస్ కు జారీ చేసింది. దీంతో పిటిషన్ దారులకు హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది.
గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కు ఎలాంటి అధికారాలు ఉన్నాయని, గ్రామ ప్రజలకు నోటీసులు జారీ చేశారని, అధికారులు చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకోకుండా భవిష్యత్లో నాలుగు వరసలు, ఆరు వరుసల రహదారి నిర్మాణం బైపాస్ ద్వారా రోడ్డు నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన లేకుండా నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు విస్తరణ పేరుతో ఆస్తులపై చర్యకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు పిటిషన్ల తరఫున న్యాయవాదులు వెంకట సుబ్రహ్మణ్యం, దాసరి శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా పడింది.