కొత్తపల్లి, మే 22 : ఎండ దంచి కొడుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవి భగ్గుమంటున్నది. అయితే ఈ ఎండ నుంచి ఉపశమనంతోపాటు ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ఈత నేర్చుకునేందుకు పట్టణాలు, నగరాల్లో ప్రతి ఒక్కరూ స్విమ్మింగ్ పూల్స్ వైపు పరుగులు తీస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈత కొట్టేందుకు మక్కువ చూపుతుండగా, ఏటా ఎండకాలంలో స్విమ్మింగ్ నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. కరీంనగర్తోపాటు జిల్లాకేంద్రాలు, గోదావరిఖనిలో స్విమ్మింగ్ పూల్స్ ఉండగా, ఉదయం 6 నుంచి 9 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఆయాచోట్ల పిల్లలకు 1500 వరకు, పెద్దలకు 1700 వరకు తీసుకుంటుండగా.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్విమ్మింగ్లో ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో అయితే అంబేద్కర్ స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్ పూల్తోపాటు కరీంనగర్ క్లబ్, జ్యోతినగర్లోని సెయింట్ జాన్స్ హైస్కూల్, రేకుర్తిలోని ప్యారడైజ్ హైస్కూల్, బైపాస్ రోడ్డులోని ఫ్లైఓవర్ సమీపంలోని అమన్స్ క్లబ్లో స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఒక్క అంబేద్కర్ స్టేడియంలోని పూల్లోనే ఈ రెండు నెలల్లో సుమారు వెయ్యి మంది శిక్షణ పొందుతున్నారు. ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటున్నది. కొత్తగా అడ్మిషన్లకు అవకాశం లేకుండా పోయింది.
నిరంతరం స్విమ్మింగ్ చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆసక్తి ఉన్న వారు స్విమ్మింగ్ను నిరంతరం సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చు. ఈ క్రీడలో రాణించేవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే వారికి నచ్చిన క్రీడల్లో శిక్షణలు ఇప్పిస్తే మెరుగ్గా రాణించే అవకాశముంటుంది. స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్ పూల్కు జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించే స్థాయి ఉన్నది.
– శ్రీకాంత్రెడ్డి, డీవైఎస్వో (కరీంనగర్)
వేసవిలో స్విమ్మింగ్ ట్రైనింగ్కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఎండకాలం సెలవుల్లో ఫుల్ రష్గా ఉంటుంది. మిగతా రోజుల్లో నామమాత్రంగా ఉంటుంది. ఏప్రిల్, మే రెండు నెలల కాలంలో అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్లో సుమారు వెయ్యి మంది శిక్షణ తీసుకున్నారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదానికి స్విమ్మింగ్ను ఆశ్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వేసవి సెలవులు గడిపేందుకు నగరానికి వచ్చే వారు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు.
-ఎండ్ర సంపత్, సీనియర్ స్విమ్మింగ్ శిక్షకుడు (కరీంనగర్)