చిగురుమామిడి/సైదాపూర్ ఏప్రిల్ 24 : కరీంనగర్ ఎంపీగా ఐదేండ్లు పదవి అనుభవించిన బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేంటో చెప్పు? గుడికో బడికో కనీసం ఐదు రూపాయలు కూడా ఎందుకు తేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శనాస్ర్తాలు సంధించారు. కాంగ్రెస్ సర్కారు అబద్ధాల పునాదులపై ఏర్పడ్డదని మండిపడ్డారు. తాను గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్తో కలిసి రోడ్షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడారు. 2004లో బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలను గెలిపిస్తే 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించామన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో వాటా కోసం అలుపెరగని పోరాటం చేశామన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని గెలిచిన బండి సంజయ్ అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేసిందని నిప్పులు చెరిగారు. క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసిందన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి ఎప్పటి వరకు ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందన్నారు.
చెరువులు, కుంటలు అడుగంటడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే నేడు చెరువులు, కుంటలు కళకళలాడేవన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం హుస్నాబాద్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, కేసీఆర్ వల్లే మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాలను చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు తీసుకువచ్చామన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని చెప్పారు. ఎంపీగా బండి సంజయ్ చిగురుమామిడికి ఎన్నిసార్లు వచ్చారని, ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కారు గుర్తుకు ఓటేసి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకవరం భవాని, జిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, ఆకవరం శివప్రసాద్, తిరుపతి, కృష్ణమాచారి, సైదాపూర్లో బీఆర్ఎస్వీ రాష్ట అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, నాయకులు చంద శ్రీనివాస్, ముత్యాల వీరారెడ్డి, కొండ గణేశ్, అబ్బిడి రవీందర్రెడ్డి, పైడిమల్ల తిరుపతి, రాములు, రవీందర్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.