వడగండ్ల వాన మళ్లీ భయపెట్టింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. వరితోపాటు ఇతర పంటలు దెబ్బతినగా, మెజార్టీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసిపోగా, రైతాంగం కన్నీరు మున్నీరైంది. మల్యాల మండలం కొండగట్టు కింద తాటి ముంజకాయలను కోసేందుకు చెట్టు ఎక్కుతున్న క్రమంలో పిడుగు పడడంతో ముత్యపు మల్లేశం(65) కింద పడి మృతి చెందాడు. పెద్దపల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆవుల మహేందర్(45) ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కరీంనగర్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. చొప్పదండి మండలంలో శనివారం సాయంత్రం వడగడ్ల వాన బీభత్సం సృష్టించింది. చొప్పదండి, చిట్యాలపల్లి, మంగళపల్లి, భూపాలపట్నం, కొలిమికుంట, గుమ్లాపూర్, వెదురుగట్ట తదితర గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలగా, మక్క, కోతకు వచ్చిన పంట నేలకొరిగింది. రామడుగు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రాంచంద్రాపూర్లో రైతు కడారి రాజేశ్కు రెండు కోళ్ళఫారాలు కూలిపోయి నాటుకోళ్లు చనిపోయాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయమార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు రోధిస్తున్నారు. మానకొండూర్ మండలం ఊటూర్, వేగురుపల్లి, పచ్చునూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. శంకరపట్నం మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. లింగాపూర్, కేశవపట్నం, ఇప్పలపల్లిలో మామిడి కాయలు నేలరాలాయి. కరీంనగర్ మండలం జూబ్లీనగర్ – చామనపల్లి రోడ్డుపై భారీ వృక్షాలు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫకీర్పేట, చామనపల్లి, చెర్లభూత్కూర్, తాహెర్ కొండాపూర్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.