జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల, జులై 20 : కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ చిన్న రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో అత్యధిక నిధులు అందజేస్తున్నామన్నారు.
వడ్లు కొనకుండా రైతులను ఆగం చేసిన ఘనత కేంద్రానిదేనన్నారు. ఉపాధి హామీ పథకంపై కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టి నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారన్నారు. బట్టలు, కూరగాయలు, గ్యాస్, పాఠ్య పుస్తకాలు, పుణ్యక్షేత్రాల్లో ఏసీ, నాన్ ఏసీ రూమ్లపై ద్వారా సామాన్యుడు నలిగిపోయేలా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ కేంద్ర ప్రభత్వ ధోరణి వల్ల పెట్రో, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నదన్నారు. పాలు, పాల పదార్థాలపై 5 శాతం జీఎస్టీ పెంచడం ద్వారా సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీశ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్యాక్స్, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.