కోరుట్ల, ఫిబ్రవరి 24: పచ్చని పందిరి. భాజాభజంత్రీల చప్పుళ్లు. బంధుమిత్రుల కోలాహలం. ఇల్లంతా పెండ్లి సందడి. మరో మూడు గంటల్లో వివాహ తంతు మొదలవుతుందనగా ఆ ఇంటా విషాదం అలుముకున్నది. ఆనందం గా కాళ్ల గోళ్ల వేడుక చూస్తున్న వరుడి తండ్రి హఠాత్తుగా కుప్పకూలాడు. దవాఖానకు తరలించేలోగా మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. వివరాలు.. కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన గంగారం-రాజేశ్వరి దంపతుల చిన్న కొడుకు ప్రశాంత్కు మల్లాపూర్ మండలం కొత్త దాంరాజ్పల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
శుక్రవారం ఉదయం 10 గం టలకు పెళ్లి జరిపించేందుకు అంతా సిద్ధమైంది. కోరుట్లలోని వరుడి ఇంటివద్ద కాళ్ల గోళ్ల తంతును తిలకిస్తున్న గంగారాం (62) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దవాఖానకు తరలించేలోపు మరణించాడు. ఈ హఠాత్పరిణామంతో బంధువులు, కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. విగతజీవిగా మారిన గంగారంను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, రెండు నెలల క్రితం గంగారాం అల్లుడు గుండెపోటుతో మృతి చెందగా, ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో దురదృష్ట ఘటన చోటు కోవడం కుటుంబ సభ్యులను కలిచివేసింది.