నేను ధర్మపురి మండలం కొత్తపల్లె మినీ అంగన్వాడీ టీచర్గా చాలా ఏండ్లుగా పనిచేస్తున్న. తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వం కూడా మా ఇబ్బందులను పట్టించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి జీతాలు పెరుగుతాయని ఎదురుచూశాం. కానీ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంకనే మా కల నెరవేరింది. సీఎం కేసీఆర్ సారు మా జీతం రూ.7800 నుంచి రూ. 13,650 చేసిండు. ఇప్పుడు వయోపరిమితి కూడా పెంచిండు. రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేల ఇస్తామని ప్రకటించిండు. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిండు. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ సారుకు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– చెన్న జ్యోతి, మినీ అంగన్వాడీ టీచర్, కొత్తపల్లె (ధర్మపురి)
అంగన్వాడీల లోకం ఆనందపడుతున్నది. బీఆర్ఎస్ సర్కారు వరాల జల్లుపై మురిసిపోతున్నది. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తూ, మరోవైపు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టే టీచర్లు, ఆయాలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడంపై ఉమ్మడి జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం, తాజాగా మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, టీచర్లు, హెల్పర్లు విరమణ పొందినప్పుడు ఆర్థిక సాయం, అర్హులైన వారికి బీమా, ఎక్స్గ్రేషియా సదుపాయం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో టీచర్లు, ఆయాలు ఆనందపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 83 చిన్న కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మారతాయని, వేతనాలు పెరుగుతాయని, అంగన్వాడీలందరికీ అనేక ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొంటూ, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చాటుతున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే కీలకమైన సేవల్లో ఉన్న అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తున్నది. టీచర్లు, హెల్పర్లకు ఇప్పటికే పలుసార్లు వేతనాలు పెంచడమేకాదు, కేంద్రంతో సంబంధం లేకుండా ఈ చిరుద్యోగుల సంక్షేమాన్ని చూసుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్లకు కేవలం 3,200 మాత్రమే వేతనం ఉండేది. హెల్పర్లకు ఇంకా తక్కువ ఉండేది. అప్పుడే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంతో సంబంధం లేకుండా చిరుద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. అంగన్వాడీలకు పలుసార్లు వేతనాలు పెంచి సముచిత స్థానం కల్పించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీచర్లకు నెలకు 13,650, హెల్పర్లకు 7,800 వేతనం అందిస్తున్నది. 2014లోనే వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్నట్టుగానే పీఆర్సీ ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు పీఆర్సీ అమలు చేయడంతో వేతనాలు గణనీయంగా పెరిగాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడీలకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి.
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,050 సెంటర్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా మరో 83 మినీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మినీ అంగన్వాడీల్లో కేవలం టీచర్లు మాత్రమే పని చేస్తున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న హెల్పర్లకు ఇస్తున్న వేతనం 7,800 వీరికి ఇస్తున్నారు. ఇప్పుడు అప్గ్రేడ్ చేయడం వల్ల వీరికి మెయిన్ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఇస్తున్న వేతనం 13,650 రానున్నది. అయితే ఈ కేంద్రాలను అప్గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయా జిల్లాల సంక్షేమ శాఖల అధికారులు ఇది వరకే ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని 83 కేంద్రాలు అప్గ్రేడ్ అవుతున్నాయి. ఈ కేంద్రాల్లో హెల్పర్లను కూడా నియమించే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లకు, హెల్పర్లకు కూడా మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంగన్వాడీల్లో పనిచేస్తున్న వారికి 65 ఏండ్లకు విరమణకు అవకాశం ఇచ్చింది. విరమణ అయిన టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50 వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. అలాగే 50 ఏళ్లలోపు ఉన్న వారికి 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఆపైన వయసు ఉన్న వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా కారణంతో ఉద్యోగంలో ఉండి మరణిస్తే తక్షణ సాయంగా టీచర్లకు 20 వేలు, హెల్పర్లకు 10 వేలు అందించనున్నారు.
అంగన్వాడీలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానిదే ఎక్కువ బాధ్యత. కానీ, రాష్ర్టాలపై భారం మోపుతున్నది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అదనపు భారాన్ని భరిస్తూ వస్తున్నది. కేంద్రంతో సంబంధం లేకుండా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ కల్పించింది. ఇప్పుడు టీచర్ల కు ఇస్తున్న వేతనాల్లో కేంద్రం ఇచ్చేది 19 శాతం మాత్రమే కాగా, ఆయాలకు ఇచ్చేది కేవలం 17 శా తం మాత్రమే. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్న ది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రయోజనం కలిగించే అ నేక నిర్ణయాలు తీసుకుంటుండగా, అంగన్వాడీలు సంబురపతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే తామింకా ఇబ్బందులు పడే వాళ్లమని వారు స్పష్టం చేస్తున్నారు..
నేను దాదాపు 14 ఏండ్ల నుంచి మినీ అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు. మొదట్లో నెలంతా పనిచేస్తే 500 జీతం వచ్చేది. తెలంగాణ సర్కారు మాపై దయతలచి, మమ్మల్ని అప్గ్రేడ్ చేసే దాకా మాకు, ఆయాలకు ఇచ్చిన జీతం నెలకు రూ.7,800 మాత్రమే. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు సమానంగా మాకు హోదా కల్పించి, రూ.13,650 ఇస్తున్నరు. నిన్నామొన్నటి వరకు పొద్దంతా పని చేసినా మాకు కనీసం రోజువారీ కూలీలకు వచ్చేంత కూడా రాకపోయేది. మమ్మల్ని కూడా అంగన్వాడీ టీచర్లుగా గుర్తించి మా కుటుంబాలను పోషించుకునేలా ఆదుకొని అప్గ్రేడ్ చేశారు. అనేక ప్రయోజనాలు కల్పించి మా కుటుంబాలకు కొండంత భరోసా కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– అనుమండ్ల వసంతలక్ష్మి, మినీ అంగన్వాడీ టీచర్, మాలపల్లి (రామడుగు)
నేను గుండి గ్రామంలో మినీ అంగన్వాడీ టీచర్గా 14 ఏండ్లుగా పనిచేస్తున్నా. మినీ కేంద్రానికి ప్రతేక నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒకటో అంగన్వాడీ కేంద్రంలోనే కొనసాగుతున్నది. ప్రస్తుతం మినీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఇద్దరు గర్భవతులు, ముగ్గురు బాలింతలు, 32 మంది చిన్నారులు ఉన్నరు. చిన్నారుల ఆలనా పాలనతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏ పని చెబితే ఆ పనులు చేస్తున్నాం. ఇప్పుడు మా ఆత్మాభిమానాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా మా కుటుంబంలో ఆనందం నెలకొంది. మా జీవితాలకు ఊతం అందించిన రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతలు.
– గుమ్మడి అరుణ, అంగన్వాడీ టీచర్, గుండి (రామడుగు)
తెలంగాణ ప్రభుత్వం మా సేవలను గుర్తించి మెన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించడం ఆనందంగా ఉంది. మాకు సహకరించిన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మినీ అంగన్వాడీ టీచర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు. నేను సైదాపూర్ మండలం నల్లానితండా మినీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. ఇన్నాళ్లూ ఎంతో పనిభారం ఉండేది. కానీ ఇప్పుడు మా సెంటర్ను అప్గ్రేడ్ చేయడం వల్ల ఆ బాధ తీరుతుంది. ఇంకా అంగన్వాడీ సిబ్బందికి ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకురావడం గొప్ప విషయం. మా కష్టానికి ప్రతిఫలం దొరికింది.
– బర్మావత్ లీల, నల్లానితండా (సైదాపూర్)
అంగన్వాడీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అంగన్వాడీ టీచర్లం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. గతంలో మా ఇబ్బందులను ఏ ఒక్క ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నో రోజులుగా జీతాలు పెరుగుతాయని ఎదురు చూసినం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంకనే మాకు జీతాలు రూ.7వేల నుంచి రూ.13,650 పెంచారు. ఇప్పుడు వయోపరిమితి కూడా పెంచారు. రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేల ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సమయానికి ఇస్తున్న. అప్పట్లో మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. కానీ కేసీఆర్ సార్ మా జీతాలు పెంచి ఉత్సాహంగా పని చేసేలా చేసిండు.
– భూక్య మంజుల, మినీ అంగన్వాడీ టీచర్, గైదిగుట్టతండా (రుద్రంగి)
మినీ అంగన్వా డీలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లూ మా సెంటర్లలో ఆయాలు లేకపోవడంతో చిన్నారుల బాధ్యత, ప్రభుత్వ పనుల్లో పాల్గొనడం ఇబ్బందిగా ఉండేది. దాదాపు పదేండ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ మా బాధలను అర్థం చేసుకొని, మాకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. మా బాధలను గుర్తించి, పరిష్కరించారు. అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ ఆయాలు, మినీ అంగన్వాడీల జీతాలు పెంచడం, వయో పరిమితి పెంచడం, రిటైర్మెంట్ తర్వాత లబ్ధి కలిగించడం సంతోషకరం.
– బానోత్ సుమిత, మినీ అంగన్వాడీ టీచర్ (రుద్రంగి)
నేను సారంగాపూర్ మండలం కీం నాయక్ తండాలో మినీ అంగన్వాడీ టీచర్గా 14 ఏండ్లుగా పనిచేస్తున్న. గత ప్రభుత్వాల పాలనలో మా బాధలు ఎవరూ పట్టించుకోలే. చాలీచాలని జీతాలతో పనిచేసినం. స్వరాష్ట్రంలోనే మా జీతాలు పెంచారు. ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసిన్రు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మాకు సహకరించిన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మినీ అంగన్వాడీ టీచర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు.