రాజన్న సిరిసిల్ల, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు గొల్ల, కుర్మలంటే మంచి శ్రీమంతులు. గొర్లను సాదుకుని, పాలూపెరుగూ అమ్ముకుని, గొంగళ్లు నేసి విక్రయించి ఒకలకు చేయిచాపకుండ బతికినోళ్లు. రాను రానూ వాళ్ల బతుకుల్ల చీకట్లు కమ్ముకున్నయ్. జీవనాధారమైన గొర్లు రోగాలచ్చి సచ్చినా అప్పట్ల పట్టించుకునేటోళ్లు లేకుండె. సెలకన్నీ చేన్లుగా మారి, గొర్లను మేప లేక, ఏం జేయాలో తెల్వక వందల మంది పొట్ట కూటి కోసం కూలీలుగా మారిన్రు. వలసలు పోయిన్రు. కానీ స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కారు, వీరి కన్నీళ్లను తుడిచేందుకు ముందుకువచ్చింది. గొల్ల కుర్మల వృత్తికి పూర్వ వైభవం తెచ్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీ గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. 21 గొర్రెలతో కూడిన (20 గొర్రెలు+ ఒక పొట్టేలు) యూనిట్ను పంపిణీ చేసి బతుకుబాట చూపింది.
రెండింతలైన సబ్సిడీ గొర్రెలు
గొర్రెల పంపిణీ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో దిగ్విజయంగా అమలైంది. అనతికాలంలో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. జిల్లాలో 16162 యూనిట్లకు సుమారు మూడు లక్షల జీవాలు అందించాలని లక్ష్యం నిర్ధేశించారు. ఈ క్రమంలో గ్రామాలవారీగా పర్యటించి అర్హులను గుర్తించారు. ఈ క్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు, ఆంధ్ర ప్రదేశ్లోని రాయలసీమ, గుంటూరు ఇతర జిల్లాలకు అధికారులు స్వయంగా వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. 16162 యూనిట్లకు గాను 11542 యూనిట్లను అందజేశారు. మిగిలినవి త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కులస్తుల్లో హర్షం వ్యక్తమైంది.
పెరిగిన గొర్రెల ఉత్పత్తి
సర్కారు ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు లబ్ధిదారులకు వరంగా మారాయి. జిల్లాలో నాలుగు లక్షల గొర్రెలు పంపిణీ చేయగా, అతి తక్కువ టైంలోనే వాటి సంఖ్య రెండింతలై పెరిగింది. ఏఊరిలో చూసినా మందలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ఎదిగిన ఒక్కో గొర్రెపిల్ల 5వేల నుంచి 10వేలకుపైనే ధర పలుకుతున్నది. ఈ క్రమంలో ఎదిగిన గొర్రెలను అమ్ముకుంటూ గొల్లకుర్మలంతా వ్యాపారులుగా మారిపోయారు. ఇదివరకు గొర్రె పిల్లల సంతలు ఇతర జిల్లాలో ఎక్కువగా నడిచేవి. కానీ, పెరిగిన సంతతితో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ప్రతి మంగళవారం మేకలు, గొర్రెల సంత నడుస్తున్నది. జిల్లాలో మెజార్టీ వ్యాపారమంతా ఇక్కడే జరుగుతుండగా, ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం, దూర భారం తగ్గింది. గొల్లకుర్మలంతా వ్యాపారులుగా మారడంతో వారి జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి.
సామూహిక గొర్రెల షెడ్లు
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలు ఇవ్వడమే కాదు, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. గొర్రెలను మేపుకొచ్చి రాత్రి వేళ ఇంటి ముందు చిన్నపాటి గుడిసెలో ఉంచే వారు. వాటికి భద్రత లేక హైనాలు, తోడేళ్లు చంపుకుతినేవి. అవే కాకుండా ఊరకుక్కలు దాడి చేసి చంపుతుంటే గొల్లకుర్మలు తీవ్రంగా నష్టపోయారు. వారి ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం సాముహిక గొర్రెల షెడ్లను నిర్మించింది. గంభీరావుపేట మండలం సుముద్రాలింగాపూర్లో 42 షెడ్ల సముదాయం నిర్మించింది. ఇక్కడ వందలాది గొర్రెలకు భద్రత కల్పించింది. ఇది తెలంగాణలోనే జిల్లాలో మొదటి షెడ్ల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది.
యూనిట్ విలువ పెంపు
రాష్ట్రంలో మాంసం ధరలు పెరుగడంతో ప్రభుత్వం మొదట నిర్ణయించిన మొత్తానికి ప్రస్తుతం 20గొర్రెలు, పొట్టేలు రావడం లేదు. మార్కెట్కు అనుగుణంగా యూనిట్ ధర 1.75లక్షలకు పెరిగింది. అందులో లబ్ధిదారుడు 25శాతం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్కు 1,31,250 సబ్సిడీ పోను, లబ్ధిదారుడు 43,750 వాటా ధనం చెల్లించాలి.
కేసీఆర్ సారు మాకు దేవుడు
పుట్టినప్పటి సంది సాకిరి జేసుకుంటు బతికినం. చెట్లు, పుట్లు పట్టుకుని మేకలను సాదిన బతుకులు మాయి. ఏండ్ల సంది కట్టపడుతున్న. ఒక్క పైసా సంపాదన లేదు. చేసింది కూలి పనాయె. ఎట్ల బతుకుడనుకున్నం. కేసీఆర్ సార్ దేవునోలే వచ్చిండు. మాఊరి కొచ్చిన సార్లు పేరు రాసుకుని గొర్రెలు ఇచ్చిన్రు. ఇచ్చిన గొర్రెలను మేమే మేపుకొంటున్నం. వాటిని సూత్తనే కడుపు నిండుతంది. రెండేళ్ల కింద ఇచ్చిన గొర్రెలు రెండింతలైనయ్. నేను మా ఆయన ఇద్దరం కలిసే మేపుతున్నం. కేసీఆర్ సార్ జెయ్యవట్టి మేం మంచిగ బతుకుతున్నం.
– ఎల్లవ్వ, చిన్నలింగాపూర్
వ్యాపారం జేత్తున్న
నాడు ఏండ్ల సంది గొర్రెలను మేపుతూ జీతగాడిలా బతికినోన్ని. ఇయ్యాల సర్కారు ఇచ్చిన సబ్సిడీ పిల్లలతో వ్యాపారం జేత్తున్న. ఒక్క యూనిట్ అనిజెప్పి 21గొర్రెలను ఇచ్చిన్రు. అండ్ల ఒక్కటి పొట్టేలు, మిగిలినవన్ని ఆడవే. ఒకటి రెండు సచ్చిపోయినయ్. గొర్రెలు ఈని పిల్లలు చేస్తే అవి నలభై అయినయ్. ఇంకొన్ని గొర్రెలు, మేకలు తెచ్చి వంద వరకు పెంచుతున్న. ఆదివారం వచ్చిందంటే గిరాకీ ఫుల్గా ఉంటంది. మాకు దారి సూపించిన దేవుడు కేసీఆర్. ఆయనకు రుణపడి ఉంటం.
– ద్యాగల ఎల్లయ్య, నర్సింహులపల్లె (తంగళ్లపల్లి మండలం)