Nandimedaram | ధర్మారం, మార్చి 14 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన శనివారం గంగ పుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా శ్రీ గంగమ్మ తల్లి గుడిని నిర్మించారు. ఈ క్రమంలో స్థానిక గంగపుత్ర సంఘం, శ్రీ గంగాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు.
ఉత్సవాలు ఈ నెల 12 నుంచి ప్రారంభమైనాయి. దీంతో ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నూతనంగా నిర్మించిన గుడిలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్టించారు. శ్రీ గంగమ్మ తల్లి తో పాటు గణపతి, శివలింగం పార్వతి, నందీశ్వరుడు, మకరం దేవి విగ్రహాలను కూడా గుడిలో ప్రతిష్టించారు. శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు.