అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రతి గింజా కొంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. నేటికి ఉమ్మడి జిల్లాలో 90 శాతం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించలేదు. పలు చోట్ల కేంద్రాలు ప్రారంభమైనా.. నిర్వాహకులు కొనుగోలుపై దృష్టి సారించడం లేదు.
అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవంటూ.. మిల్లర్లు ముందుకు రావడం లేదంటూ.. దాటవేస్తుండడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలతోపాటు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సెంటర్ల వద్ద సౌకర్యాలు కల్పించి, తేమ శాతం ఉన్న వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ కోనరావుపేట : కేసీఆర్ పాలనలో నిరందీగా ఎవుసం చేసుకున్న రైతులు, కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్నారు. పోయినేడు యాసంగి మాదిరిగానే ఈ సారి కూడా సాగునీరు వస్తుందని ఆశించి సాగు చేసినా.. నీళ్లు రాక తండ్లాడుతున్నారు. చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండిపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. కొందరైతే రోడ్డెక్కి ప్రభుత్వం తీరుపై నిరసనలు తెలిపారు. మరికొందరు చేసేదేమీ లేక పశువుల మేతకు వదిలేశారు. ఇంకొందరు ఆశ చావక పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేశారు. బావుల్లో పూటిక తీయించారు. కొత్త బోర్లు వేయించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని పొలాలకు పారించారు.
ఇలాంటి పరిస్థితుల్లో చేతికొచ్చిన దిగుబడులను అమ్ముకునేందుకు ఇప్పుడు మళ్లీ అష్టకష్టాలు పడుతున్నారు. ఇరువై రోజుల నుంచి కోతలు మొదలు కాగా.. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొంత మంది రైతులు వారం ముందుగానే కోతలు కానిస్తున్నారు. ఇప్పటికే ఉధృతం చేశారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడే మూడు నాలుగు రోజులు ఆరబోసి, ఇక కొంటారని ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఎండబెట్టి విక్రయించేందుకు తెస్తే.. సెంటర్లు ఓపెన్కాక నిరాశ చెందుతున్నారు. వారం క్రితమే పలు చోట్ల ప్రజాప్రతినిధులు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినా.. కొనుగోళ్లు మొదలు కాక అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
నాలుగు రోజులుగా వాతావరణం మబ్బుపట్టి ఉండడం, శనివారం అక్కడక్కడా జల్లులు పడడం.. మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే సూచనలు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిసి, తమ రెక్కల కష్టం నీటిపాలవుతుందేమోనని భయపడుతున్నారు. రేయింబవళ్లు అక్కడే ఉంటూ.. వాతవరణం కొంచెం తేడాగా ఉన్నా పరదాలు, కవర్లు కప్పుతున్నారు. కొన్నిచోట్ల పరదాలు ఇవ్వకపోవడంతో బయట కొనుకొచ్చుకొని కాపాడుకుంటున్నారు.
ప్రభుత్వం తమను ఇంత గోస పెట్టవద్దని, వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ఎక్కడికక్కడ ముమ్మరం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గడిచిన పదేళ్లలో ఎన్నడూ ఇలాంటి సమస్య రాలేదని, ఊరికో సెంటర్ ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. పంటల పెట్టుబడికి సకాలంలో రైతుబంధు ఇచ్చారని, యాసంగిలోనూ పుష్కలంగా నీరందించారని, పండించిన పంటను కల్లాల వద్దే కొన్నారని చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నదని, తాము అరిగోస పడతున్నామని వాపోతున్నారు.
యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 8 నాటికే 1,183 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. అయితే కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినా.. ఎక్కడా కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. దీంతో రైతులకు నిరాశ తప్పడం లేదు. కోతలు ముమ్మరం అవుతుండగా.. ధాన్యం ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు వెల్లువెత్తనున్నది. ఈ క్రమంలో అధికారయంత్రాంగం అప్రమత్తమై.. లక్ష్యం మేరకు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేయాల్సిన అవసరమున్నది. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదమున్నది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తరలి వస్తున్నది. ఆరబోసిన ధాన్యాన్ని వెనువెంటే కొనకపోతే అకాల వర్షాలతో రైతన్న మునిగే ముప్పుంటుంది.
ప్రస్తుతం ధాన్యం ఫైన్ రకం క్వింటాల్కు 2,203, సాధారణ రకానికి 2,183 మద్దతు ధర ఉంది. తాము అధికారంలోకి వస్తే క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటనలు కూడా చేసింది. కానీ, ఇప్పట్లో ఇవ్వడం గగనమేనని తెలుస్తున్నది. పైగా కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు ఆగమవుతున్నారు. ఓవైపు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం.. మరోవైపు అకాల వర్షాల ముప్పు పొంచి ఉండడంతో ఏం చేయాలో తెలియక ప్రైవేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లకు తెగనమ్ముకుంటున్నారు. క్వింటాల్కు 1800 చెల్లిస్తుండగా, ఒక్కో క్వింటాల్పై సుమారు 400 దాకా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఈ యాసంగి సీజన్లో గంగాధర మండలంలోని 33 గ్రామాల్లో రైతులు 18,900 ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగునీరందక పోయినా అష్టకష్టాలు పడి పంటలను కాపాడుకున్నారు. పదిహేను రోజుల నుంచే కోతలు మొదలు పెట్టి.. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 33 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడా కూడా కిలో ధాన్యాన్ని కొనలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆకాశం మబ్బులు పట్టి ఉందని, వర్షం పడితే తమ కష్టం నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజుల కింద కురిక్యాల కేంద్రానికి వడ్లు తెచ్చిన. ఇప్పటి వరకు వడ్లు కొనలె. ఆకాశం మొఖాన చూస్తే మస్తు భయమైతంది. రోజూ జల్లులు పడుతున్నయి. వడ్లు తడువకుంట పరదాలు కప్పి కాపాడుకుంటున్నం. పెద్ద వాన పడితే వడ్లు నీళ్లల మునిగి చేతికి రాకుండ పోతయి. అధికారులు స్పందించాలి. వడ్లు కొని మా రైతులను ఆదుకోవాలి.
– మడుపు రవీందర్రెడ్డి, రైతు (కురిక్యాల)
ఐదు రోజుల కింద కురిక్యాల కేంద్రానికి వడ్లు తెచ్చిన. నాలుగు రోజుల కిందనే కేంద్రాన్ని ప్రారంభించిన్రు. కానీ, ఇంకా కొనుడు చాల్ జెయ్యలె. అకాల వర్షాలు పడెటట్టు ఉన్నయి. అందుకే రాత్రింబవళ్లు వడ్లకాన్నే కావలి కాత్తున్నం. వాన పడకుంటే వడ్లు నేరిపి ఎండవెడుతున్నం. వానత్తె పరదాలు కప్పుతున్నం. వెంటనే వడ్లు కొని మా రైతులు నష్టపోకుండా చూడాలి.
– జాగిరపు రవీందర్రెడ్డి, రైతు (కురిక్యాల)